ఎవరీ స్మగ్లర్ గంగిరెడ్డి?: విదేశాల్లో విలాస జీవితం
మారిషస్: పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకుని విదేశాలకు పారిపోయిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి విదేశాల్లో విలాస జీవితం గడిపినట్లు తెలుస్తోంది. అతనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో 27 కేసులున్నాయి. మారిషస్, దుబాయ్ మధ్య అతను విజిటింగ్ వీసాలపై తిరిగినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ ద్వారా అతను డబ్బులు సమకూర్చునట్లు భావిస్తున్నారు. అలాగే, అంతర్జాతీయ స్మగ్లర ద్వారా డబ్బులు సమకూర్చుకున్నట్లు అనుమానిస్తున్నారు. రెండు దేశాల్లోనూ అతను స్మగ్లర్ల ఇళ్లలో ఆశ్రయం పొందినట్లు భావిస్తున్నారు. అతన్ని ఎపికి తీసుకుని వెళ్లేందుకు సిఐడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని ఇంటర్పోల్ అధికారులు మంగళవారం మారిషస్ కోర్టులో హాజరు పరిచారు. మార్చి 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కాగా, గంగిరెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అది ఈ నెల 26వ తేదీన విచారణకు రానుంది. సోమవారం మారిషస్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు గంగిరెడ్డి అక్కడి ఎయిర్పోర్టుకు వచ్చాడు. అక్కడ దుబాయ్కు టిక్కెట్ తీసుకుంటుండగా అతని పాస్పోర్టు నెంబర్ ఇంటర్పోల్ అధికారులకు ఇవ్వడంతో వెంటనే అధికారులు గంగిరెడ్డిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అతను గంగిరెడ్డే అని నిర్థారణ కావడంతో ఏపీ సీఐడీ అధికారులకు సమాచారం అందించారు.
ఎర్రచందనం అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు గడించిన గంగిరెడ్డి 2014 మే 17 సినీఫక్కీలో దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసుల మోస్ట్వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో అతడు మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో ఏపీ డీజీపీ జేవీ రాముడు, సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు అతడి అరెస్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
సీబీఐ ద్వారా ఆగస్టులో రెడ్కార్నర్ నోటీసు ఇప్పించి విదేశాల్లో నిఘా పెట్టారు. క్రిమినల్ మైండ్ ఉన్న గంగిరెడ్డి మొదట మారిషస్కు వెళ్లినా తర్వాత సింగపూర్ చేరుకున్నాడు. అయితే, అక్కడికి ఏపీ ప్రభుత్వం నుంచి ఎక్కువమంది వెళుతుండటం చూసి దుబాయ్కి మకాం మార్చాడు. దుబాయ్లో ఉంటున్న అంతర్జాతీయ స్మగ్లర్ సాహుభాయ్తో గంగిరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఏపీ పోలీసులు పసిగట్టడంతో కౌలాలంపూర్కు చేరాడు. అక్కడ సెల్ నెంబర్లు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండేవాడు. అతనిపై నిఘా పెట్టిన ఏపీ పోలీసులు గంగిరెడ్డి కదలికలను ఎప్పటికప్పుడు ఇంటర్పోల్కు అందించేవారు.
విషయాన్ని పసిగట్టిన గంగిరెడ్డి సెల్ఫోన్ వాడటమే మానేశాడు. విదేశాల్లో తనకు పరిచయం ఉన్న స్మగ్లర్ల ద్వారా వారిపేరుతో నెంబర్లు తీసుకొని, సన్నిహితులకు ఫోన్లు చేసి ఇంటికి సమాచారం ఇచ్చేవాడు. ఇరవై రోజుల క్రితం ఇలాగే ఫోన్చేసి ఈ నెల 22 తర్వాత శ్రీలంకకు వెళతానని చెప్పాడు. దీన్ని పసిగట్టిన సీఐడీ అధికారులు డీజీపీ జేవీ రాముడుకు విషయం చెప్పడంతో ఆయన ఇంటర్పోల్తో మాట్లాడారు.
అయితే వాంటెడ్ పర్సన్కు సంబంధించిన మరిన్ని వివరాలు అందజేయాలని కోరడంతో పదిరోజుల క్రితం సీఐడీ అధికారులను ఢిల్లీకి పంపి గంగిరెడ్డికి సంబంధించిన పూర్తివివరాలను అక్కడి ఇంటర్పోల్ అధికారులకు అందజేశారు. దాంతో అతని అరెస్టు సాధ్యమైంది.