స్నేక్ గ్యాంగ్: గుర్రాలు, కారు, బైక్లు స్వాధీనం
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని పహాడీషరీఫ్ పరిధిలో గత అర్థరాత్రి నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 350 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు చేపట్టారు. సైబరాబాద్ సీపీ ఆనంద్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. స్నేక్ గ్యాంగ్ ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీ ఇంట్లో రెండు గుర్రాలు, కారు, రెండు బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఫైసల్ దయానీ సోదరులు అమీర్, అఖిల్లను అరెస్ట్ చేశారు. స్నేక్ గ్యాంగ్ ముఠా సభ్యులు చోరీల కోసం గుర్రాలను వాడారని ఆరోపిస్తూ జంతు హింస కింద కేసు నమోదు చేశారు. అలాగే తనిఖీల్లో భాగంగా 8 మంది రౌడీ షీటర్లు, మరో 11 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనుమానితుల్లో ఐదుగురు స్నేక్ గ్యాంగ్ నిందితులకు సహకరించినట్టు సమాచారం. 30 బైక్లు, మూడు వ్యాన్లు, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఫామ్ హౌస్లో కాబోయే భర్తను నిర్బంధించి యువతిని పాములతో బెదిరించి, వివస్త్రను చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన నేపథ్యంలో స్నేక్ గ్యాంగ్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి.
స్నేక్ గ్యాంగ్ సభ్యులపై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. స్నేక్ గ్యాంగ్ తాము చేసిన నేరాలను వీడియోల్లో చిత్రీకరించింది. ఆ వీడియోలను ప్రసారం చేసిన టీవీ చానెల్పై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. స్నేక్ గ్యాంగ్ ఘటనలో మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు. తనిఖీల్లో భాగంగా ఎటువంటి ఆధారాలు లేని 30 టూవీలర్లను, ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.