అరుదైన భారీ స్వర్ణనాగు: మూడు గంటలు కలకలం..భయంతో చంపేశారు..
శ్రీకాళహస్తిలోని స్థానిక ఆర్టీసీ బస్టాండుకు సమీపంలో ఉన్న ఎన్టీఆర్ కూడలి వద్దకు ఓ భారీ స్వర్ణనాగు వచ్చింది.
చిత్తూరు: మూగజీవాలు దారి తప్పి జనావాసాల్లోకి వచ్చి గందరగోళం సృష్టించే ఘటనలు చాలానే చూసుంటాం. ముఖ్యంగా కోతులు, ఎలుగుబంట్లు జనావాసాల్లోకి చొరబడితే జనం భయంతో పరుగులు తీయడం.. అందరు కలిసి మూకుమ్మడి దాడి చేయడం వంటివి గమనించే ఉంటాం.
మూగజీవాలేవి జనావాసాల్లోకి చొరబడ్డా సరే.. కొంతమంది విచక్షణతో వాటిని పట్టుకుని అటవీ అధికారులకు పట్టిస్తుంటారు. మరికొందరు భయంతో బెంబేలెత్తిపోయి వాటి ప్రాణం తీస్తుంటారు. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీలోను ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
శ్రీకాళహస్తిలోని స్థానిక ఆర్టీసీ బస్టాండుకు సమీపంలో ఉన్న ఎన్టీఆర్ కూడలి వద్దకు ఓ భారీ స్వర్ణనాగు వచ్చింది. రోడ్డుపై రాకపోకలు సాగించే జనాలు దాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. అక్కడే ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోకి చొరబడ్డ పాము మూడు గంటలు ముప్పుతిప్పలు పెట్టింది.
పరిస్థితిని గమనించిన ఓ ఆటో డ్రైవర్ కర్ర సహాయంతో పామును చాకచక్యంగా చంపేశాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాళహస్తిలో పాము రేపిన ఈ అలజడి గురువారం స్థానికంగా కలకలం రేపింది.