Tirumala During Lockdown: పాముల హల్చల్ ... సర్ప సంచారం అరిష్టం అంటున్న స్థానికులు
లాక్ డౌన్ ప్రభావంతో శ్రీవారి ఆలయానికి భక్తుల దర్శానలను రద్దు చేసి స్వామి వారి నిత్య కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే . టీటీడీ తిరుమల కొండపైకి వెళ్ళే అన్ని మార్గాలను మూసివెయ్యటంతో ఇప్పుడు ఆ మార్గాలన్నీ జంతువులకు ఆలవాలంగా మారాయి. జంతువులతో పాటు పాములు రోడ్ల మీద దర్శనం ఇస్తున్నాయి . దీంతో తిరుమలలో స్థానికంగా నివాసం ఉండే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు .
భవిష్యత్ లో కరోనా మహమ్మారి విశ్వరూపం... డబ్ల్యూహెచ్ఓ షాకింగ్ వ్యాఖ్యలు
పాముల దెబ్బకు హడలిపోతున్న తిరుమలలోని స్థానికులు
కరోనా ప్రభావంతో విధించిన లాక్ డౌన్ తో భక్తుల దర్శనాలపై విధించిన నిషేధం కొనసాగుతుంది . లాక్డౌన్తో తిరుమల గిరులపై నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు స్వేచ్చగా సంచరిస్తున్నాయి . మనుషుల అలికిడి లేకపోవడంతో ఇప్పుడు తిరుమల వీధులు, ఘాట్ రోడ్లు పాములకు ఆవాసంగా మారిపోయాయి. తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో స్థానికులు నివాసం ఉంటున్న విషయం తెలిసిందే . ఇక వీరు వన్య ప్రాణుల సంచారంతోనే కాదు పాముల దెబ్బకు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఇక బాలాజీ నగర్, ఈస్ట్ బాలాజీ నగర్లలో సైతం పాముల సంచారం అధికంగా ఉంటోంది.
కరోనాకు కాలసర్ప దోషానికి ముడి పెడుతూ టెన్షన్ పడుతున్న ప్రజలు
ఇక తిరుమల స్థానికులకు ఇన్ని పాములు ఇంత పెద్ద సైజులో ఎప్పుడూ కనబడలేదు. దీంతో వారిలో ఆందోళన నెలకొంది . ఓ పక్క కరోనాకు జోతిష్యానికి ముడిపెడుతూ కాలసర్ప దోషాన్ని జోతిష్యులు ఆపాదిస్తున్న విషయం తెలిసిందే . ఇక ఇదే సమయంలో బ్రహ్మం గారి కాలజ్ఞానంలో తిరుమలలో ఇలా జంతువులు, సర్పాలు తిరుగుతాయని మరోపక్క నమ్మకాలువెరసి స్థానికులు ఇదంతా అరిష్టంగా భావిస్తున్నారు. పుణ్యక్షేత్రాలలో సర్పదర్శనం అరుదుగా జరుగుతుందని ఇది దేనికో పెద్ద విపత్తుకు సంకేతం కావొచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు .
తిరుమలలో సర్ప సంచారం అరిష్టం .. విపత్తు సంభవిస్తుందని చర్చ
మొత్తానికి సర్పసంచారం దేనికి దారి తీస్తుందో అన్న ఆందోళన స్థానికుల్లో ఎక్కువవుతుంది .గత కొద్ది రోజులుగా తిరుమల కొండపై జనసంచారం లేకపోవడంతో జంతు సంచారం అలాగే సర్ప సంచారం ఎక్కువగా ఉంది. ఇక తాజాగా బాలాజీనగర్ ప్రాంతానికి సమీపంలోని డిటైప్ క్వాటర్స్ రోడ్డుపై ఏడడుగుల నాగుపాము పడగవిప్పి బుసలు కొట్టింది . పామును చూసిన స్థానికులు వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు .దీంతో వెంటనే అటవీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఏడు అడుగుల పొడవున్న నాగుపామును పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే పాముల సంచారం తిరుమల పుణ్య క్షేత్రానికి మంచిది కాదని స్థానికులు తీవ్రంగా బాధ పడుతున్నారు .
Recommended Video
అటవీప్రాంతం , ఆపై నిర్మానుష్యం కావటంతోనే జంతు , సర్ప సంచారం అంటున్న అటవీశాఖ
సమీప ప్రాంతం అంతా అటవీ ప్రాంతం కావటం అందులోనూ మనుషుల అలికిడి లేకుండా ఉండటంతోనే వన్యప్రాణులు ,పాములు రోడ్ల మీదకు వస్తున్నాయని అటవీ శాఖాధికారులు అంటున్నారు. లేనిపోని అపోహలు పెట్టుకోవద్దని చెప్తున్నారు . ప్రతి చిన్న విషయాన్నీ శీవారి ఆలయానికి ముడిపెట్టి చూడవద్దని కోరుతున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు గోవింద నామాలతో ప్రతిధ్వనించిన తిరుమల గిరులు ఇప్పుడు వన్య ప్రాణుల సంచారంతో , నాగుపాముల బుసలతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.