జైలు వారంగా మార్చారు: జగన్మోహన్ రెడ్డిపై గోరంట్ల సెటైర్లు
రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారాన్ని పోలవారంగా మారిస్తే.. ప్రతిపక్ష నేత జగన్ శుక్రవారాన్ని జైలువారంగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.
అంతేగాక, వీరిద్దరి మధ్య ఈ తేడాను నంద్యాల, కాకినాడ ఓటర్లు గమనించాలని గోరంట్ల బుచ్చయ్యచౌదరి కోరారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 విజయసాయిరెడ్డి, లిక్కర్ మాఫియా బొత్స సత్యనారాయణ, మైనింగ్ మాఫియా ధర్మాన ప్రసాదరావు కాకినాడ వచ్చి గూండాగిరి చేస్తుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు.
కాకినాడ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని గోరంట్ల అన్నారు. అన్ని ఫెడరేషన్లకు నిధులిచ్చి అభివృద్ధి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో తమదే గెలుపు అని స్పష్టం చేశారు.