సముద్ర తీరంలో గౌతమి మరణం: అనుమానాలెన్నో? హత్యేనా?
ప్రకాశం: జిల్లాలో రెండ్రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన గౌతమి(27) కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గౌతమి ఆత్మహత్య చేసుకోలేదని.. ఎవరో ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు హత్య కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.
చంపేశారా?
నాలుగేళ్ల క్రితమే వివాహమైన గౌతమి.. గురువారం రామాపురం వద్ద సముద్ర తీరంలో మునిగి విగత జీవిగా తేలిన విషయం తెలిసిందే. కాగా, ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు.
భర్తతో వివాదాల నేపథ్యంలో..
ఏడు నెలలుగా భర్త కోటా వెంకటరామకృస్ణ మణికంఠ పవన్కుమార్, గౌతమి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కట్నం విషయంలో కూడా వీరి మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంట్లో భార్యభర్తల మధ్య జరుగుతున్న వివాదాలను గౌతమి తన తల్లిదండ్రుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లింది.
అనుమానాలకు తావిస్తున్న భర్త వ్యాఖ్యలు
కాగా, తాను ఎంజీసీ మార్కెట్లో వస్త్రదుకాణం మూసేసి ఇంటికి వచ్చానని, గురువారం తెల్లవారేసరికి తన భార్య కనిపించలేదని భర్త పవన్ తెలిపాడు. అంతేగాక, గౌతమి రామాపురం బీచ్లో విగత జీవిగా పడి ఉందని సమాచారం తెలుసుకుని వెళ్లానని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఆత్మహత్యే చేసుకుంటే..
బుధవారం రాత్రి వేళ లేదా గురువారం తెల్లవారు జామున గౌతమి ఒంటరిగా రామాపురం బీచ్కు వెళ్లి సముద్రంలో మునిగి ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అలలు, గాలి తాకిడికి ఒకచోట మునిగితే శవమైన తర్వాత మరో ప్రాంతంలో శవం ఒడ్డుకు కొట్టుకొస్తుంది. గౌతమి మృతదేహం మాత్రం మునిగిన ప్రాంతంలోనే శవమై కనిపించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు.