పోలవరంలో ఎన్నో ఉల్లంఘనలు..! అందుకే రీటెండరింగ్ అంటున్న వైసిపీ ప్రభుత్వం..!!
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్తో ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లను పిలవాలని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ప్రధాన కాంట్రాక్టర్ తో ఒప్పందం రద్దయితే ఇక సబ్ కాంట్రాక్టర్ లకు అవకాశం ఉండదని, అందువల్ల మొత్తం అన్ని పనులకు కొత్తగా టెండర్లు పిలవాల్సిందేనని సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అవకతవకలు, అంచనాల పెంపు, నిబంధనల ఉల్లంఘనల వంటి అంశాలపై పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఇంజినీర్లతో ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే.
పోలవరానికి మళ్లీ టెండర్లు..? ట్రాన్స్ట్రాయ్తో ఒప్పందం రద్దు..!!
ముందుగా వీరిని పోలవరం ప్రాజెక్టుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరింది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు 2005లో టెండర్లు పిలిచిన నాటి నుంచి చోటుచేసుకున్న అన్ని పరిణామాలపై కమిటీ దృష్టి సారించింది. గత 5ఏళ్ల టీడిపి ప్రభుత్వ కాలంలో తీసుకున్న నిర్ణయాలను, ఉత్తర్వులను సమగ్రంగా సమీక్షించింది. పోలవరం ఇంజినీరు ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీరు శ్రీధర్లను కమిటీ ప్రశ్నించింది. మొత్తం అన్ని రికార్డులను సమగ్రంగా పరిశీలించిన మీదట ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేస్తూ నివేదికను సిద్ధం చేసింది. సీల్డ్ కవరులో ఉన్న ఈ నివేదికను బుధవారం జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నారు.
దివాలా తీసిన గుత్తేదారు ఎలా..? ఉల్లంఘనలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటున్న టీడిపి..!!
పోలవరం ప్రాజెక్టు పనులను 2013లో ట్రాన్స్ట్రాయ్ సంస్థ టెండర్లద్వారా దక్కించుకుంది. అంచనా విలువపై 14శాతం తక్కువకే పనులు చేస్తామంది. ఆ తర్వాత కాలంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ట్రాన్స్ట్రాయ్ ఆధ్వర్యంలో ఎల్అండ్టీ, బావర్, త్రివేణి, కెల్లర్, బెకం వంటి సంస్థలు ఉపగుత్తేదారులుగా వివిధ పనులను చేస్తున్నాయి. మరోవైపు స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యాం తదితర పనులను ట్రాన్స్ట్రాయ్ నుంచి 60సి కింద తొలగించి నవయుగ సంస్థకు జల వనరులశాఖ అప్పగించింది.
పనులు ఆగకుండా చర్యలు చేపట్టాలి..! నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు..!!
దాదాపు 4000 కోట్ల రూపాయల విలువైన పనులను నవయుగ చేపట్టింది. ఈ లోగా బ్యాంకుల రుణాలు చెల్లించలేక ట్రాన్స్ట్రాయ్ సంస్థ దివాలా తీసింది. దీంతో దాదాపు పోలవరంలోని పనులన్నింటినీ వేరే సంస్థలకు జల వనరులశాఖ అప్పగించింది. ప్రధాన కాంట్రాక్టర్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదు. ప్రధాన కాంట్రాక్టర్ దివాలా నేపథ్యంలో పనులను ఎలా కొనసాగిస్తారని నిపుణుల కమిటీ అధికారులను పరిశీలన సందర్భంగా ప్రశ్నించినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టులో 2005 నుంచి సాగిన టెండర్ల ప్రక్రియతోపాటు 2014 తర్వాత ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, జల వనరులశాఖ రాష్ట్ర మంత్రి ఎలా జోక్యం చేసుకున్నారు? వారి ప్రమేయం ఎక్కడెక్కడ.. ఎలా ఉంది? తదితర అన్ని అంశాలను నిపుణుల కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.
గందరగోళానికి తావివ్వం..! అంతా పారదర్శకమే అంటున్న ప్రభుత్వ పెద్దలు..!!
మరోవైపు పోలవరం ప్రధాన ప్రాజెక్టులో భాగమైన హైడల్ ప్రాజెక్టు టెండర్లనూ రద్దు చేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేస్తున్నట్లు తెలిసింది. తొలుత విద్యుత్తు కేంద్రం పునాది పనులను ట్రాన్స్ట్రాయ్కే అప్పజెప్పారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి 3220.28 కోట్ల రూపాయల విలువతో నవయుగ సంస్థకు అప్పగించారు. ఆ తర్వాత 5338.95 కోట్ల రూపాయలకు ఈ ప్రాజెక్టు అంచనాలను సవరించారు. ఏ మాత్రం పనులు చేపట్టకుండానే 10శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా 310 కోట్ల రూపాయలను ఎలా చెల్లించారని కమిటీ తప్పుబట్టినట్లు సమాచారం.