శోభ మృతి: తల్లడిల్లిన జగన్, స్పృహతప్పిన భూమా
హైదరాబాద్/కర్నూలు: శోభా నాగిరెడ్డి మృతి విషయం తెలిసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పొన్నూరు, గుంటూరు రోడ్డు షోలను రద్దు చేసుకొని పయనమయ్యారు. విషయం తెలియగానే ప్రజలను ఉద్దేశించి ఆయన గద్గద స్వరంతో మాట్లాడారు. పార్టీ అభివృద్ధిలో ఆమె కృషి ఎనలేనిదన్నారు. శోభ తనకు సోదరిలాంటిదని, తన కోసం ప్రతి అడుగులోనూ అడుగు వేసిందన్నారు.
అలాంటి శోభ ప్రమాద వార్త తెలిసినప్పటి నుంచి తన మనసుకు ఎంతో కష్టంగా ఉందని, తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని వెళుతున్నాని చెప్పారు. ఆమె గాయపడ్డ విషయం తెలిసినప్పుడు, మృతి చెందిన వార్త తెలిసినప్పుడు జగన్ తల్లడిల్లిపోయారు.
శోభానాగిరెడ్డి మృతి వార్త తెలిసి హైదరాబాద్ వెళుతున్న వైయస్ జగన్ నందిగామ 65వ నంబర్ జాతీయ రహదారిపై చందాపురం బైపాస్ వద్ద పలువురు పార్టీ నాయకులు ఆపారు. ఆయన క్షణంపాటు ఆగి, శోభానాగిరెడ్డి ఇక లేరని చెమర్చిన కళ్లతో అభిమానులను ఓదార్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు శోభ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కాగా, శోభా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రెండు రోజుల పాటు ప్రచార కార్యక్రమాలను రద్దు చేసింది.
సృహ తప్పిన భూమా
శోభా నాగిరెడ్డి మరణ వార్త తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. భర్త భూమా నాగిరెడ్డి కేర్ ఆస్పత్రిలో సృహ తప్పి పడిపోయారు. వారి పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. సినీనటి మంచులక్ష్మి వారిని అక్కున చేర్చుకుని ఓదార్చారు.
నేడు అంత్యక్రియలు
గురువారం మధ్యాహ్నం 1.45 గంటలకు శోభా నాగిరెడ్డి మృతదేహాన్ని ఆళ్లగడ్డకు ప్రత్యేక అంబులెన్స్లో కేర్ ఆస్పత్రి నుంచి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అళ్లగడ్డలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు జగన్, విజయమ్మ, షర్మిల, భారతితోపాటు పలువురు నేతలు హాజరు కానున్నారు. శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా గురువారం ఆళ్లగడ్డలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు.