వారే మీ కాళ్ల వద్దకు: శోభా, వేగం తగ్గింది: పురంధేశ్వరి
రాష్ట్ర విభజనను నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్లో తమ పార్టీ ప్రజాప్రతినిధులు ధర్నా నిర్వహిస్తారని తెలిపారు. తెలుగు తల్లి విగ్రహం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు పాదయాత్ర చేసి, అనంతరం ధర్నా చేస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయాలని, విభజనకు అనుకూలంగా టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో ఈ ఆందోళన చేస్తున్నట్టు చెప్పారు.
చంద్రబాబు, సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే సోనియా, ఆంటోనీ కమిటీ రెండూ మనకాళ్ల దగ్గరికి వస్తాయని, వీళ్లందరూ ఢిల్లీకి వెళ్లి ఏమీచెయ్యక్కర్లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన దృష్టి పెట్టడం మాని ఆరు కోట్ల ప్రజల గురించి ఆలోచించి ఉంటే చంద్రబాబు వెంట ప్రజలు ఉండేవారని, ఆయన చర్యల వల్ల వచ్చే ఎన్నికల్లోనూ ప్రతిపక్షనేతగానే ఉండక తప్పదన్నారు.
తమ పార్టీని అశోక్ బాబు శంకించాల్సిన అవసరం లేదని, ఎపిఎన్జీవోలు సమ్మెకు దిగకముందే తాము రాజీనామాలు సమర్పించామన్నారు. మీసాలు తిప్పడం తమ నైజం కాద ని, పదవులు వదులుకొని ప్రజల వైపు నిలబడ్డామని మంత్రి టిజి వెంకటేష్ను ఉద్దేశించి అన్నారు.
మా వల్లే వేగం తగ్గింది: పురంధేశ్వరి
విభజన జరుగుతుందంటే పదవులకు రాజీనామాలు చేయడానికి వెనుకాడేది లేదని కేంద్ర సహాయ మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి విశాఖలో అన్నారు. పదవుల్లో ఉండి సమైక్యాంధ్రకు అనుకూలంగా కృషి చేయడం వల్లనే విభజన ప్రక్రియ వేగం మందగించిందని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని, ఆంటోని కమిటీకి సమైక్యవాదాన్ని సమర్థంగా వినిపిస్తున్నామన్నారు.