శోభ..షర్మిల కార్లో వెళ్తే, డ్రైవర్ అదృశ్యం: పవన్ సంతాపం
పవన్ సంతాపం
శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ఆమె కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ సాట్ర్ పవన్ కళ్యాణ్ తన సంతాపం తెలియజేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 11.05 గంటలకు ఆమె కన్నుమూసిన సంగతి తెలిసిందే. శోభా మృతి నేపథ్యంలో చంద్రబాబు కర్నూలులో తన ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు.
డ్రైవర్ అదృశ్యం!
శోభా నాగిరెడ్డి కారు డ్రైవర్ నాగేంద్ర. కారు ప్రమాదంలో అతను కూడా గాయపడ్డాడు. అతను నంద్యాలలోని సాయివాణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనిపించకుండా పోయాడని తెలుస్తోంది. బుధవారం రాత్రి ప్రమాదంలో గాయపడ్డ నాగేంద్రను మొదట ఆళ్లగడ్డలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు.
బంధువులు మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి నంద్యాలకు తరలించారు. కడుపు, చాతినొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స చేశారు. గురువారం ఉదయం తాను ఆరోగ్యంగా ఉన్నానని, మేడమ్ శోభా నాగిరెడ్డిని చూసి వస్తానని ఆసుపత్రి సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడట. ప్రస్తుతం అతను కనిపించడం లేదంటున్నారు. నాగేంద్ర స్వస్థలం ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు. మరోవైపు తాను అదృశ్యమయ్యాననే ప్రచారంపై డ్రైవర్ నాగేంద్ర స్పందించారు. తాను ఎక్కడకు వెళ్లలేదన్నారు. తాను సొంత గ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నానన్నారు.