కళ్లు దానం చేసిన శోభానాగిరెడ్డి, చిరు పార్టీనుండి ఒక్కరే
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డి తన కళ్లను దానం చేశారు. 1996లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన శోభా నాగిరెడ్డి టిడిపి, ప్రజారాజ్యం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో కీలకనేతగా ఎదిగారు. తన నియోజకవర్గంలో కార్యకర్తలను పేరుపేరునా అభిమానంతో పిలుస్తారని పేరు ఉంది. అలాంటి శోభా నాగిరెడ్డికి తన కళ్లను దానం చేసి సామాజిక స్పృహ ఎక్కువగా ఉందని చాటారు.
శోభా నాగిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ కేర్ ఆసుపత్రికి వచ్చారు. శోభ మృతి తమకు తీరని లోటు అన్నారు. ఆమె తన కళ్లను దానం చేశారని వాసిరెడ్డి పద్మ చెప్పారు. శోభా నాగిరెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువులు, అభిమానులు, అనుచరులు అంతా శోకసముద్రంలో మునిగిపోయారు.
కాగా, శోభా నాగిరెడ్డి మరణవార్త విని ఆమె తండ్రి, మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. అసలు చిన్నమ్మాయి లేదన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానన్నారు. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదని, అందరికంటే చిన్నమ్మాయి అని, చిన్నవయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి మంచి పేరు సంపాదించుకుందని, ఆమె ఎన్నో విజయాలు సాధించిందన్నారు.
పిఆర్పీ నుండి సీమలో ఒకే ఒక్క మహిళ
2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పైన భారీ అంచనాలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా ఆ పార్టీ రాష్ట్రంలో 18 నియోజకవర్గాలలో మాత్రమే గెలుపొందింది. రాయలసీమలో నాడు ప్రజారాజ్యం పార్టీ నుండి గెలుపొందిన ఏకైక మహిళ శోభా నాగిరెడ్డి మాత్రమే.