జగన్ను సిఎంగా చూడాలనుకున్న శోభా, పార్టీకి లోటే
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఆ కల నెరవేరుతుందని ఆమె పలుమార్లు ధీమా వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసిన శోభా నాగిరెడ్డి 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పిఆర్పీ కాంగ్రెసు పార్టీలో విలీనం కావడంతో ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. నాటి నుండి ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలోపేతం కోసం చాలా కృషి చేశారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు ఆమె నిత్యం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వెంట నడిచారు. దాదాపు విజయమ్మ వెంట చాలా సందర్భాల్లో ఆమె కనిపించేవారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ వందకు పైగా స్థానాల్లో గెలుపొంది.. జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆమె విశ్వసించారు. జగన్ను సిఎంగా చూడాలని ఆమె కోరుకున్నారు.
వైయస్ జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలలో పట్టుదల ఉందని ఆమె పలు సందర్భాలలో చెప్పారు. కొన్ని సందర్భాలలో శోభా నాగిరెడ్డి జగన్ పైన అలక వహించినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ ఆమె కొట్టి పారేశారు. పార్టీని అధికారంలోకి తేవడమే తమ కర్తవ్యంగా చెప్పారు. కర్నూలు జిల్లాలో తనకంటూ ప్రత్యేక చాటుకున్న శోభా నాగిరెడ్డి.. పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు చాలా కృషి చేశారు. శోభ మృతి పార్టీకి చాలా పెద్ద లోటు అని చెప్పవచ్చు.