కేటుగాడు:ఫేస్బుక్ లో 'బుకింగ్'..వాట్సప్లో ఛాటింగ్..ఫైనల్ గా ఫుల్ ఛీటింగ్
Recommended Video
ఏలూరు:వీడో వెరైటీ ఛీటర్...అచ్చంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవడమే కాదు వారిని అన్ని విధాలా దోచుకుంటున్నాడు. ఇతడు మోసగించేతీరు పోలీసుల్ని సైతం విస్మయపరిచిందంటే వీడెంతటి కేటుగాడో అర్ధం చేసుకోవచ్చు.
ఫస్ట్ ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకుంటాడు...ఆ తర్వాత వాట్సప్ ద్వారా లవ్ ఛాటింగ్ చేస్తాడు...ఆపైన వారికి మరింత దగ్గరై వారితో సన్నిహితంగా మెలుగుతూ ఫోటోలు...వీడియోలు తీసుకుంటాడు. ఇక ఆ తరువాత అసలు స్వరూపం చూపిస్తాడు. తాను అడిగినట్లు డబ్బు, నగలు ఇవ్వకపోతే మీ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇలా వీడిబారిన పడి మోసపోయిన వారు ఎంతో మంది. అయితేనేం ఎట్టకేలకు ఏలూరు పోలీసులకు దొరికిపోయాడు. వివరాలు...
పేరు...ఊరు...బ్యాక్ గ్రౌండ్
ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం...ఏలూరు దక్షిణపు వీధికి చెందిన చిన్నపల్లి ముఖేష్ సాయి(22) డిగ్రీ చదివి బలాదూర్ గా తిరుగుతూ ఉంటాడు. ఇతడి తండ్రి రవికుమార్ భీమవరంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ముఖేష్ సాయి కూడా భీమవరంలోనే తండ్రి వద్దే ఉంటున్నాడు. ఇతడికి జల్సా గా బతకడం అంటే చాలా ఇష్టం. ఇందుకోసం ఇతడు ఒక వెరైటీ పంథా ఎంచుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఆడవాళ్లని ట్రాప్ చేసి తద్వారా డబ్బు సంపాదించాలని డిసైడ్ అయ్యాడు.
ఫేస్ బుక్...ఫస్ట్ బుక్
ఆ క్రమంలో ఫేస్ బుక్ ద్వారా విశాఖపట్నానికి చెందిన పూర్ణ అనే యువతిని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె ద్వారానే ఆమెకు వరుసకు చెల్లెలు అయ్యే లావణ్య అనే వివాహిత(22) వివరాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ట్రాప్ చేశాడు. వాట్సప్ లో ఎన్నో ప్రేమ కబుర్లు చెప్పాడు. వీడి మాయమాటలు నమ్మిన ఆమెతో అనేక రకాల ఫొటోలు,సెల్ఫీలు దిగాడు. వీడియోలు షూట్ చేశాడు. అలా ఆమెతో చేసిన ఛాటింగ్...డేటింగ్ వివరాలన్నీ భద్రపర్చుకున్నాడు. ఆ తరువాత తన నిజ స్వరూపం చూపించాడు.
బ్లాక్ మెయిల్...ఫుల్ మాల్
తాను అడిగినంత ఇవ్వకపోతే వాటన్నింటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని...మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అలా పలు విడతలుగా 528 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. ఆ తరువాత ఇక ఆమె ఏమీ ఇవ్వలేదని తెలిసాక వదిలేశాడు. అయితే ఆమె కేసు పెట్టడంతో ముఖేష్ సాయిపై గాజువాకలో మొదటి కేసు నమోదైంది. ఆ తరువాత ఇదే స్టయిల్లో ఏలూరు రామచంద్రరావుపేటకు చెందిన 21 ఏళ్ల మరో యువతిని కూడా ట్రాప్ చేశాడు. ఆమెని కూడా ఇలాగే బెదిరించి రెండు కాసుల బంగారపు చైను తీసుకున్నాడు. ఆమె కూడా పోలీసులను ఆశ్రయించడంతో ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.
పోలీసుల స్కెచ్...అడ్డంగా బుక్
దీంతో ఈ విషయం వెస్ట్ గోదావరి ఎస్పీ ఎం.రవిప్రకాష్ వద్దకు చేరగా ఆయన ఆదేశాలు,సూచనలతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఇతడు ఆదివారం ఏలూరులోని తన స్వగృహానికి రావడంతో ఆ సమాచారం తెలుసుకున్న పోలీసులు ముఖేష్ సాయిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 450 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టుగా డిఎస్పీ చెప్పారు. వీటి విలువ సుమారు 11 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. డీఎస్పీ మాట్లాడుతూ తెలియనివారు ఫేస్బుక్ల్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపితే యాక్సెప్ట్ చేయవద్దని, అపరిచితులతో వాట్సప్ చాటింగ్ లు చేయవద్దని యువతులకు సూచించారు.