సోషల్ మీడియాలో నేతల హవా... టాప్లో ప్రధాని మోదీ... ఆన్లైన్ ట్రెండ్స్లో జగన్ టాప్-2..
దేశంలో సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. ఈ ఏడాది అగస్టు-అక్టోబర్ మధ్య కాలంలో ట్విట్టర్,యూట్యూబ్,గూగుల్ సెర్చ్ తదితర సామాజిక మాద్యమాల్లో మోదీ పేరు పైనే అత్యధిక ట్రెండ్స్ ఉన్నాయి. మూడు నెలల వ్యవధిలో ఆయన పేరుపై దాదాపు 2171 ట్రెండ్స్ నమోదయ్యాయి. దేశంలోని టాప్ 95 పొలిటీషియన్స్,500 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులకు సంబంధించిన ఆన్లైన్ ట్రెండ్స్ను విశ్లేషించి చెక్బ్రాండ్స్ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది.
జగన్ టాప్-2...
చెక్బ్రాండ్స్ రిపోర్ట్ ప్రకారం... గడిచిన త్రైమాసికంలో ట్విట్టర్,గూగుల్ సెర్చ్,వికీ,యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ హవానే కొనసాగింది. 2171 ఆన్లైన్ ట్రెండ్స్తో ఆయన అగ్ర స్థానంలో ఉండగా... ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండటం విశేషం. జగన్ పేరుపై దాదాపు 2137 ఆన్లైన్ ట్రెండ్స్ నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలు ఆ తదుపరి స్థానాల్లో ఉన్నారు.
మోదీ బ్రాండ్ స్కోర్ ఎంతంటే...
ఆయా సామాజిక మాధ్యమాల్లో టాప్-20లో నిలిచిన మొత్తం 86,400 ఆన్లైన్ ట్రెండ్స్ను ఈ రిపోర్ట్ కోసం చెక్బ్రాండ్స్ విశ్లేషించింది. దాని ప్రకారం 70 బ్రాండ్ స్కోర్తో ప్రధాని మోదీ అగ్ర స్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానంలో బ్రాండ్ స్కోర్ 36.43తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. మోదీకి,ఆ తర్వాతి స్థానానికి మధ్య బ్రాండ్ స్కోర్లో భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ బ్రాండ్ స్కోర్ 31.89తో,అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమా ఖండు బ్రాండ్ స్కోర్ 31.89తో,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బ్రాండ్ స్కోర్ 27.03తో ఆ తదుపరి స్థానాల్లో ఉన్నారు. ఫాలోవర్స్,ట్రెండ్స్,సెంటిమెంట్,పోస్ట్ ఎంగేజ్మెంట్,మెన్షన్స్ ఆధారంగా ఈ జాబితా రూపొందించారు.
Recommended Video
బ్రాండ్ వాల్యూలోనూ మోదీదే హవా..
బ్రాండ్ వాల్యూలోనూ ప్రధాని మోదీనే అగ్రస్థానంలో నిలవడం విశేషం. మోదీ బ్రాండ్ వాల్యూ రూ.336కోట్లు కాగా... ఆ తర్వాతి స్థానాల్లో అమిత్ షా(రూ.335కోట్లు),ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్(రూ.328కోట్లు) ఉన్నారు. ఫాలోవర్స్,ఎంగేజ్మెంట్,ట్రెండ్స్ ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో ఆయా వ్యక్తుల పట్ల వ్యతిరేకతను,సెంటిమెంటును కూడా ఇందుకోసం పరిగణలోకి తీసుకున్నారు.
మోదీ పట్ల దాదాపు 25శాతం వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఈ రిపోర్టు కోసం పరిగణలోకి తీసుకున్న 95 మంది నేతల్లో మోదీ బ్రాండ్ వాల్యూనే అత్యధికం కావడం విశేషం. గత మూడు నెలల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే పేరిట సోషల్ మీడియాలో దాదాపు 40వేల మెన్షన్స్ నమోదైనట్లు రిపోర్ట్ వెల్లడించింది.