సోషల్ మీడియాను భ్రష్టు పట్టిస్తున్న రాజకీయపార్టీలు .. పైసా ఖర్చు లేకుండా బురద చల్లుకుంటున్న నేతలు
రాజకీయ పార్టీల నేతలు సామాజిక మాధ్యమాలను భ్రష్టు పట్టిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా బక్కెట్ల కొద్దీ బురదను ఒకరి మీద ఒకరు చల్లుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న నెటిజన్లు రాజకీయ నేతలు చేస్తున్న ఈ కంపును భరించలేక పోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న సోషల్ మీడియా వార్ ప్రజలకు సైతం చికాకు కలిగిస్తోంది. కాసేపు సోషల్ మీడియాలో రిలాక్స్ అవుదామని ఉన్నవారు కాస్త రాజకీయ నాయకుల చెత్త పోస్టులు చూసి చిరాకు పడుతున్నారు.
సోషల్ మీడియా వార్ .. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలకు సోషల్ మీడియా వేదిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా నడుస్తున్న సోషల్ మీడియా వార్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నాయకులు ప్రెస్ మీట్ లు మానేసి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రతి విషయాన్ని రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన టిడిపిలో తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టుకుంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని , చంద్రబాబు నాయుడిని సోషల్ మీడియా వేదికగా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ను టార్గెట్ చేసి నానా తిట్లు తిడుతున్నాడు. ఇక బుద్ధా వెంకన్న తానేమీ తక్కువ కాదంటూ కేశినేని నాని పై దుమ్మెత్తి పోశాడు. దీంతో టీడీపీ లో ఉన్న అంతర్గత కలహాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా టిడిపి నాయకులు చేస్తున్న రచ్చ చూస్తున్న ప్రజలు ఒకరి బాగోతం ఒకరు బయటపెట్టుకుంటున్న విధానం చూసి షాక్ తింటున్నారు.
సోషల్ మీడియాను తిట్టటానికి తెగ వాడేస్తున్న విజయసాయి, పోటీగా లోకేష్ .. రాష్ట్రం కోసం చెయ్యాల్సిన పని గాలికి
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా అత్యంత ఉన్నతమైన హోదానిచ్చి కేంద్రంలో రాజకీయాలు చేయమని బాధ్యత అప్పజెప్పిన కీలక నేత విజయ్ సాయి రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా టీడీపీ మీద దాడి చేస్తున్నారు. నోటికి వచ్చిందల్లా తిడుతున్నారు. పొద్దుకు 10 పోస్ట్ లు పెడుతూ, టిడిపి పాలన అంతా అవినీతిమయం అంటూ నానా రచ్చ చేస్తున్నారు. అవినీతి పుట్టలు బద్దలు కొడతాం అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. కేంద్రం నుండి ఏపీకి రావలసిన ప్రయోజనాలు సాధించడంపై , ప్రత్యేక హోదా విషయంలో చేయవలసింది దానిపై దృష్టి పెట్టకుండా చంద్రబాబు నే టార్గెట్ చేసుకొని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో తిట్టిపోయడం చాలా మంది ప్రజలకు రుచించడం లేదు.
ఇక వైయస్ విజయసాయి రెడ్డికి నేనేమి తక్కువ కాదంటూ ఈ మధ్య నారా లోకేష్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. విజయసాయి రెడ్డి పెట్టిన పోస్టులన్నింటికీ కౌంటర్ చేస్తూ నారా లోకేష్ జగన్ సర్కార్ పైన సోషల్ మీడియా వేదికగా దండయాత్ర ప్రారంభించారు. ఇలా ఒకరి నుంచి ఒకరికి సోషల్ మీడియా వేదికగా తిట్టుకునే కల్చర్ పెరిగిపోతోంది.
పైసా ఖర్చు లేకుండా పక్క పార్టీల మీద బురద .. సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తున్న రాజకీయ నేతలు
సోషల్ మీడియాలో రెండు పార్శ్వాలు ఉంటాయి. మంచి చెడు.. కానీ రాజకీయ పార్టీల నాయకులు మాత్రం పైసా ఖర్చు లేకుండా పక్క పార్టీల మీద చెడును ప్రచారం చేయడానికి, బకెట్ల కొద్దీ బురదను వారి మీద ఎత్తి పోయడానికి మాత్రమేఈ సామాజిక మాధ్యమాలు వినియోగిస్తుండడం గమనార్హం. సామాజిక మాధ్యమాలను మంచి కోసం వినియోగిస్తే, ప్రయోజనకరమైన అంశాల కోసం వినియోగిస్తే అది సద్వినియోగం అవుతుంది. అలా కాకుండా కేవలం ఇలా రాజకీయాలు చేయడానికి మాత్రమే వినియోగిస్తే దుర్వినియోగం అవుతుంది. ఏ ఉద్దేశంతో అయితే సోషల్ మీడియా నెట్వర్కింగ్ ప్రారంభమైందో ఆ ఉద్దేశ్యమే దెబ్బతింటుంది. ఇప్పటికైనా నేతల తీరు మారాలి.. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ రచ్చ ఆపి పాలనపై వైసిపి, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వానికి సూచనలు చేయడానికి టిడిపి పని చేయాలి.