స్ఫూర్తి : లక్షల్లో జీతాన్ని వదులుకుని నాగలి పట్టిన టెక్కీ
ఓ స్ఫూర్తి మనిషిని రుషిని చేస్తుంది అంటే బహుశా ఇదేనేమో.. ఓ ప్రోత్సాహం ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది.. ఓ తెగింపు మనిషిని విజయతీరాలకు చేర్చుతుంది.. ఓ ప్రేరణ ఎందరికో మార్గదర్శకం అవుతుంది.. ఇక్కడ కనిపించే యువరైతు కూడా అంతే. కంప్యూటర్లు వదిలి నాగలి పట్టాడు.. యువ రైతుగా అందలం ఎక్కాడు. అందరూ పల్లెలను విడిచి పట్నం బాట పడుతున్న ఈ రోజుల్లో.. లక్షలు సంపాదించే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పల్లెబాట పట్టాడు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఇచ్చిన పిలుపుతో నా జన్మభూమి అనే నినాదానికి తొలి అడుగు వేశాడు. ఈ యువ సాఫ్ట్ రైతుపేరే ఇక్కుర్తి లక్ష్మీనరసింహారావు. జాతీయ ఉత్తమ గ్రామీణ సాధకుడి అవార్డ్ దక్కించుకుని యువ రైతులకు ఆదర్శంగా నిలిచాడు.ఇంతకీ ఎవరీ లక్ష్మీనరసింహారావు?
గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం యాజలి గ్రామం ఇక్కుర్తి లక్ష్మీనరసింహారావుది. ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్నాడు. ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఐటీ ఉద్యోగం. లక్షల్లో జీతం. మంచి ఫ్లాట్ లో నివాసం. చేతిలో స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లు, మల్టీఫ్లెక్సుల్లో వినోదం. జీవితం హ్యాపీగా సాగిపోతోంది. కానీ మనస్సులో మాత్రం ఏదో తెలియని వెలితి. ఏదో కోల్పోతున్నాను అనే బాధ. ఊరి కాని ఊరిలో.. ఏంటీ బతుకు.. దేశానికే అన్నం పెడుతున్న రైతు కుటుంబం నుంచి వచ్చాను.. వారికి ఏమైనా చేయాలననే ఆలోచన నిరంతరం వెంటాడుతూ ఉండేది. ఇక ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకానొక రోజు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కుటుంబ సభ్యులను ఒప్పించాడు. వెంటనే హైదరాబాద్ నుంచి తన సొంతూరు యాజలి గ్రామానికి వచ్చేశాడు.
రైతు కోసం మేము సైతం అనే నినాదం
రైతుకి బాధలు దూరం చేయాలనే ఆలోచనతో రైతు కోసం మేము సైతం అనే నినాదంతో నా జన్మభూమి అనే సంస్థను స్థాపించాడు. రైతులు పండించిన పంటను నేరుగా వినియోగదారులకే అందించటంతోపాటు.. మార్కెట్ లో అధిక ధరలకు విక్రయించేలా కృషి చేశారు. నాణ్యమైన పంట మంచి ధర అని అటు రైతులు - ఇటు వినియోగదారుల్లో అవగాహన కల్పించారు. దీంతో యాజలి గ్రామంలో పండే పంటకు డిమాండ్ ఏర్పడింది. మరోవైపు రసాయనిక ఎరువులను తగ్గించి.. సంప్రదాయమైన పద్దతుల్లో సాగుకు ప్రోత్సహించే వారు. ఇది సత్ఫలితాలను ఇచ్చింది. రైతులకు మంచి ఆదాయం రావటం మొదలైంది.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్ఫూర్తితోనే ..
ఎవరో ఒకరు.. ఎపుడో అప్పుడు కదలరా ముందుకు అంటారు.. అచ్చం ఇలాగే గ్రామాల్లో రైతులకు అండగా కదలండి అంటూ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఆయన తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి రైతు కోసం గ్రామాల్లోకి వచ్చారు. ఆయన స్ఫూర్తి, ఆచరణ ఈ లక్ష్మీనరసింహారావుని కదలించాయి. ఆయన మాటలు ప్రేరణ ఇచ్చాయి. కొండంత బలాన్ని ఇచ్చాయి. నాలుగు నెలల క్రితం మాజీ జేడీ లక్ష్మీనారాయణను యాజలి గ్రామానికి ఆహ్వానించారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, మంచి లాభాలు అనే అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఇది ఎంతో ఉపయోగపడింది అంటారు లక్ష్మీనరసింహారావు.
జాతీయస్థాయిలో గుర్తింపు మరోమైలురాయి
వ్యవసాయంలో కృషి చేస్తోన్న యువ రైతులను కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ ఉత్తమ గ్రామీణ సాధకుల పేరిట గౌరవిస్తోంది. ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి
ఇక్కుర్తి లక్ష్మీనరసింహారావు రైతుల కోసం చేస్తున్న సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా లభించింది. ఈ సంవత్సరం ఏపీ రాష్ట్రం నుంచి జాతీయ ఉత్తమ గ్రామీణ సాధకునిగా అవార్డు వరించింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతులుమీదుగా ఈ అవార్డును అందుకున్నాడు లక్ష్మీనరసింహారావు.ఓ స్ఫూర్తి, ప్రేరణకు ఇంత కంటే ఏం కావాలి అంటున్నారు ఈయన. మనం కూడా ఆల్ ద బెస్ట్ చెబుదాం...