ఫొటో: మోసంతో విలాసజీవితం, టెక్కీ దంపతుల అరెస్టు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఓ సాఫ్ట్వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి వారిని మోసం చేసింది. సికింద్రబాద్లోని సైనిక్పురికి చెందిన టెక్కీ దంపతులు సత్యరమణ మూర్తి, అమూల్య సోమాజీగూడలో జీవీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని గత ఏడాది నవంబర్లో స్థాపించారు.
ఉడ్యోగాలు ఇస్తామని చెప్పి, ట్రైనింగ్ పేరుతో ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ. 40 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారని అభ్యర్థులు ఆరోపించారు. నెలల గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో అభ్యర్థులు కంపెనీ నిర్వాహకులపై తిరగబడ్డారు.
డబ్బులు ఇవ్వాలని వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కంపెనీని వేరో చోటికి తరలిస్తున్నామని, అప్పటివరకు ఉద్యోగానికి రానవసరంలేదని యాజమాన్యం చెప్పడంతో అనుమానం వచ్చిన బాధితుఉలు పోలీసులను ఆశ్రయించారు.
అన్యాయంగా వసూలు చేసిన డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా మూర్తి, అమూల్యపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
టెక్కీ దంపతులు విలాసజీవితానికి అలవాటు పడి నిరుద్యోగులను మోసం చేస్తూ గతంలో కూడా అరెస్టయిన సంఘటనలు ఉన్నాయి. వారిద్ధరితో పాటు రిసెప్షనిస్టు అర్షియా బేగంను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.