నిరుద్యోగులకు కుచ్చుటోపీ: తిరుపతిలో వైజాగ్ టెక్కీ సాప్ట్వేర్ 'కోర్సుల' మోసం
హైదరాబాద్: నిరుద్యోగులను మోసం చేయడంలో సాప్ట్వేర్ కన్సల్టెన్సీ సంస్ధలు ఎప్పుడూ ముందుంటాయి. తాజాగా బెంగుళూరులో తమకు ఓ సాప్ట్వేర్ కంపెనీ ఉందని చెప్పి కోర్సులు నేర్పించి అందులో ఉద్యోగం ఇస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఉదంతం తిరుపతిలో మంగళవారం వెలుగు చూసింది.
ఈ వ్యవహారంపై సీఐ (ఈస్టు) రామ్కిషోర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిరుపతి నగరంలో వీవీ మహల్ రోడ్డులోని ఓ భవనంలోని వెరిజోటెక్ ఐటీ సొల్యూషన్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన విశ్వప్రసాద్ అనే వ్యక్తి ఈ కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్, చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
బెంగళూరులో ఉన్న ఐటీ కంపెనీకి అనుబంధంగా కన్సల్టెన్సీని 2015లో ప్రారంభించామని, ఇక్కడ కోర్సులు నేర్చుకుంటే అక్కడ ఉద్యోగాలు కల్పిస్తామని 91 మంది నిరోద్యోగులకు ఆశ చూపాడు. జావా, ఎక్స్ ఎంఎల్ సర్వీసెస్, సీవీఎస్ లాంటి కోర్సులు నేర్పించి, సంవత్సరానికి రూ.3 నుంచి 4 లక్షల వరకు ప్యాకేజీ ఇప్పిస్తామని నమ్మించి వారిని కోర్సుల్లో చేర్పించుకున్నాడు.
ఇలా కోర్సుల్లో చేరిన ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశాడు. ఇలా దాదాపు రూ. 70 లక్షల వరకు వెనకేశాడు. ఈ క్రమంలో విశ్వప్రసాద్ చేతిలో మోసపోయిన హరిప్రసాద్ అనే వ్యక్తి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కన్సల్టెన్సీ బాగోతం వెలుగు చూసింది.
తిరుపతి పట్టణంలోని న్యూ ఇందిరా నగర్లో నివాసముంటున్న హరిప్రసాద్ అనే నిరుద్యోగి సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం వస్తుందనే ఆశతో వెరిజోటెక్లో చేరాడు. ఆ తర్వాత అతి బోగస్ సంస్థ అని తేలడంతో డబ్బులు వెనక్కివ్వాలని సంస్ధ ఛైర్మన్ విశ్వప్రసాద్ను డిమాండ్ చేశాడు.
ఇలా కొన్ని రోజుల పాటు కన్సల్టెన్సీ చుట్టూ తిరిగిన అతడు చివరకు విసిగెత్తి తిరుపతి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెరిజోటెక్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పోలీసుల సోదాల్లో కార్యాలయం లోపల చూసిన విస్తుతపోయారు.
కార్యాలయం లోపల కంప్యూటర్లలో ఒక్కటీ పనిచేయడం లేదు. కనీసం ఫ్యాన్లు కూడా తిరగడం లేదు. అక్కడ పనిచేస్తున్న వారిని ప్రశ్నించగా తమ యజమాని కొద్దిరోజుల నుంచి కనిపించడంలేదని బదులివ్వడంతో మొత్తం 91 మంది బాధితుల బయోడేటాలు, కంపెనీకి సంబంధించిన ప్యూచర్ప్లాన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిరుద్యోగులను మోసం చేసేందుకు ఈ కార్యాలయాన్ని పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు మాట్లాడుతూ కేవలం బాధితుడు మాత్రమే ఫిర్యాదు చేశాడని, మిగతావారుకూడా ముందుకొచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.