అత్తగారింట్లో ఆత్మహత్య చేసుకున్న సాప్ట్వేర్ ఇంజనీర్
హైదరాబాద్: నగరంలో ఓ ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న సాప్ట్వేర్ ఇంజనీర్ తన పుట్టిన రోజునే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామంలో జరిగింది. పోలీసులు అందించిన వివరాలా ఇలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లా ఆత్మకూర్ మండలం బట్టపాడు గ్రామానికి చెందిన నిరంజన్కుమార్ ఆరేళ్లుగా హైదరాబాద్ నిజాంపేటలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. గత ఏడాది మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన వైద్యురాలు ప్రవల్లికతో వివాహం జరిగింది. కుటుంబ గొడవలతో మూడు నెలల క్రితం ప్రవల్లిక హైదరాబాద్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
దాంతో ప్రవల్లిక తల్లిదండ్రులు నిరంజన్పై వరకట్నం కేసు పెట్టారు. ఈ వరకట్నం కేసులో నిరంజన్ కుమార్ రెండు నెలల జైల్లో ఉండి ఇటీవలే బెయిల్పై బయటకి వచ్చాడు. శుక్రవారం కేసు విచారణకు హాజరై అత్తగారి ఊరైన రాజారాంకు వచ్చాడు.
అర్ధరాత్రి తనకు బతకాలని లేదని, చనిపోతున్నానంటూ నెల్లూరులోని తమ్ముడు రంజిత్కు ఎస్ఎంఎస్ పంపించాడు. ఆ తర్వాత రాజారంలోని అత్తగారింటి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్లపాటు ఉద్యోగం చేసిన తన అన్నయ్య... హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు ఉరివేసుకున్నాడో అర్ధం కావడం లేదని రంజిత్ పేర్కొన్నాడు. రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.