బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ: రోడ్డుపై ఉద్యోగులు
గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన భానుప్రకాష్ కొంత కాలంగా హైదరాబాదులోని ఫతేనగర్లో నివాసముంటున్నాడు. తన బావమరిది శశికాంత్రెడ్డితో కలిసి కొద్దిరోజుల క్రితం బోయిన్పల్లిలో ఆప్తి టెక్నో సాప్ట్వేర్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగావకాశాలు ఇప్పిస్తానని ప్రకటనలు గుప్పించాడు. దీంతో పలువురు నిరుద్యోగ యువతీ, యువ కులు ఉద్యోగం వస్తుందనే ఆలోచనతో అప్పు చేసి లక్షల రూపాయలు చెల్లించారు.
కొద్దిరోజుల క్రితం భానుప్రకాష్ కార్యాలయాన్ని బోయిన్పల్లి నుంచి మాదాపూర్కు, అక్కడి నుంచి సోమాజిగూడకు మార్చాడు. సుమారు 250 నుంచి 300 మంది ఉన్నత విద్యా వంతులైన నిరుద్యోగ యువతీయువకుల వద్ద 60 వేలు మొదలుకుని 1.50 లక్షల వరకు వసూలు చేశాడు. ఏపీఎస్టీయూ (ఏపీ స్టేట్ టీచర్స్ యూనియన్) నుంచి డాట్నెట్ ప్రాజెక్ట్ వచ్చిందని వారికి నమ్మబలికాడు.
కొంత మందికి శిక్షణ సమయంలో 4 వేల రూపా యలు చెల్లించాడు. మరికొంతమందికి రూపాయి కూడా ఇవ్వలేదు. ఉద్యోగులు కొంత కాలంగా ఒత్తిడి తేవడం ప్రారంభించారు. రేపు, మాపు అంటూ తప్పించుకుంటున్నాడు. అక్టోబర్ 31న సోమాజిగూడలోని కార్యాల యాన్ని కూడా ఖాళీ చేసినట్టు తెలిసింది. గడిచిన మూడు రోజులుగా డబ్బులు చెల్లించిన నిరుద్యోగ యువతీయువకులు, ఉద్యోగులు కార్యాలయం చుట్టూ తిరుగు తున్నారు. ఫలితం లేకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.