ఏపీలో రూ.200 కోట్లు వసూల్: ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.10 లక్షలు, జగన్ చెప్పిన వినని ఎమ్మెల్యేలు..
మంచి కొలువు, సరిపోయే జీతం ఉంటే ఓకే.. అదీ ఫైరవీ ద్వారా వస్తుందంటే.. అప్పో సప్పో చేసి పెట్టేందుకు వెనకాడరు. దానికి తోడు కాంటాక్ట్ ఉద్యోగం కాస్త పర్మినెంట్ అవుతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో సబ్ స్టేషన్లలో షిప్ట్ ఆపరేటర్కు కూడా ఆంధ్రప్రదేశ్లో డిమాండ్ ఉంది. నిరుద్యోగుల అవకాశాన్ని క్యాష్ చేసుకున్న ఎమ్మెల్యేలు.. ఒక్కో కొలువుకు రూ.10 లక్షలు వసూల్ చేశారు. అలా 5 వేల మంది నుంచి డబ్బులు కలెక్ట్ చేశారు. ఆ మొత్తం రూ. 200 కోట్ల వరకు ఉంటుందనే అంశం కలకలం రేపుతోంది. సబ్ స్టేషన్ షిప్ట్ ఆపరేటర్ల విషయంలో కలుగజేసుకోవద్దని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులు, తనను కలిసిన ఎమ్మెల్యేలకు సీఎం జగన్ స్పష్టంచేశారు. కానీ నేతలు మాత్రం వినిపించుకోవడం లేదు.
కస్టమర్ సర్వీసులా ఐఏఎస్ - పీవీ రమేష్ ట్వీట్ కలకలం- జగన్ పై గురి పెట్టారా ?
ఒక్కో పోస్టుకు 10 లక్షలు..
ఏపీలో షిప్ట్ ఆపరేటర్ పోస్టులు 12 వేల పోస్టులు ఉంటాయి. గ్రామ సచివాలయ ఉద్యోగాలు రావడంతో 1800 మంది రాజీనామా చేశారు. జీతం బాగుండటం, పర్మినెంట్ అవుతుండటంతో కొలువు కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఒక్కో పోస్టుకు రూ.10 లక్షల వరకు అభ్యర్థులు అప్పజెప్పారు. సబ్ స్టేషన్లో కొలువు అంటే స్ధానిక ఎమ్మెల్యేతో పని అవడంతో.. నిరుద్యోగులు కూడా డబ్బులు ఇచ్చేశారు.
రూ.200 కోట్లు వసూల్
సీఐటీయూ కార్మిక అనుబంధం సంఘం యునైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు కూడా చేసింది. ఒక్కో పోస్టుకు రూ.పది లక్షల చొప్పు న రూ.200 కోట్లు వసూలు చేశారని ఆరోపించింది. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులకు నిరుద్యోగులు డబ్బులు ఇచ్చారని తెలిపింది. విషయం సీఎం జగన్కు తెలియడంతో పోస్టుల భర్తీని నిలిపివేయాలని అప్పట్లో ఆదేశించారు. దీంతో వసూళ్లకు, ఉద్యోగాల భర్తీకి మాత్రం బ్రేకు పడింది.
కొలువు రాకపోవడంతో ఒత్తిడి
డబ్బులు వసూలు చేసిన నేతలు.. అభ్యర్థులకు తిరిగి ఇవ్వలేదు. నాలుగు రోజులు ఆగితే పోస్టు ఇప్పిస్తామని చెబుతూ వచ్చారు. నెలలు గడుస్తోన్నా ఉద్యోగాలు రాకపోవడంతో అభ్యర్థులు నేతలపై ఒత్తిడి పెంచారు. దీంతో ఎమ్మెల్యేలు అధికారుల వెంట పడుతున్నారు. పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేల ఒత్తిడితో అధికారులు ఏం చేయాలో తెలియడం లేదు అని వాపోతున్నారు.
ఎమ్మెల్యేల ఒత్తిడి
తిరుపతి కేంద్రంలో ఉన్న ఎస్పీడీసీఎల్ డిస్కం అధికారులపై స్థానిక నేతల ఒత్తిడి బాగా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇక గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో మాత్రం విచిత్ర పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు చెప్పారని కొందరు అభ్యర్థులు వచ్చి విద్యుత్ శాఖ కార్యాలయాలు, సబ్ స్టేషన్ వస్తున్నారు. అయితే వారికి ఏ పని అప్పగించకపోయినా ఉద్యోగుల్లా రావడంతో అధికారులు నోరెళ్లబెడుతున్నారు. రోజు వస్తున్నందున వారికి జీతం ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారని మరికొందరు అధికారులు చెబుతున్నారు.
Recommended Video
15 మంది తొలగింపు
వాస్తవానికి కొత్త ఉద్యోగాలు లేవు కానీ పాతవారిని తీసి వేసి పెట్టుకోవాలని ఎమ్మెల్యేలు ఆదేశిస్తున్నారు. ఎమ్మెల్యే ఒత్తిడి తేవడంతో నెల్లూరు జిల్లాలో 15 మంది ఆపరేటర్లను తొలగించి కొత్తవారిని పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే పనిచేస్తున్న వారిని అర్ధాంతరంగా తొలగించడం సరికాదని కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నెల్లూరు ఎస్ఈ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా చేపట్టారు. గుంటూరు జిల్లాలో కూడా ఉద్యోగులు ఆందోళనకు దిగారు.