ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అదృశ్యం: బంగాళాఖాతంలో శకలాలు అవేనా?
చెన్నై/విశాఖ: బంగాళాఖాతంలో అదృశ్యమైన భారత్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్ 32 ఆచూకీ కోసం బలగాలు గాలిస్తున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. ఏఎన్ 32 విమానం సముద్రంలో కూలి ఉంటుందని భావిస్తున్న సమయంలో, తాజాగా కొన్ని శకలాలు బంగాళాఖాతంలో కనిపించాయని ఆయన వెల్లడించారు.
అయితే, ఏఎన్ 32 విమానానివో కాదోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విమానం ఆచూకీ గురించి భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని చెప్పారు. దాని గురించి కచ్చితమైన నివేదికలు లేవని చెప్పారు.
కాగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్ 32 వారం రోజుల క్రితం గల్లంతయిన విషయం తెలిసిందే. విమానంలో 29 మంది సిబ్బంది ఉన్నారు.
చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్తుండగా హఠాత్తుగా శుక్రవారం ఉదయం ఏటీసీతో ఆ విమానానికి సంబంధాలు తెగిపోయాయి. విమానం కోసే నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విమానం చెన్నైలోని తంబరం నుంచి ఉదయం 8.30 గంటలకు గాల్లోకి ఎగిరింది. ఆ తర్వాత పదహారు నిమిషాలకు సంబంధాలు తెగిపోయాయి.