అమిత్షాకు జగన్పై కేంద్ర మంత్రుల ఫిర్యాదు: ఆ నిర్ణయాలతో ఏపీకి నష్టమే: షా చెప్పిందేంటి..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి నచ్చటం లేదు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన కేంద్ర మంత్రులు బీజేపీ జాతీజయాధ్యక్షుడు..హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసారు. ఈ మధ్య కాలంలో పీపీఏ లతో పాటుగా పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలనే ప్రతిపాదన పైన కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది తమ పరిధిలో అంశం కాకపోయినా పలు కారణాలను తెర మీదకు తెస్తోంది. ఇక...పోలవరం విషయంలో రీ టెండరింగ్ పేరు తో కాంట్రాక్టు రద్దు చేయాలనే ప్రతిపాదన పైన కేంద్రం లోతుగా అధ్యయనం చేస్తోంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పైనా సీరియస్గా ఉన్నారు. చంద్రబాబును లక్ష్యంగా చేసు కొని తీసుకుంటున్న నిర్ణయాలు..ఏపీకి నష్టం చేస్తాయనేది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది.
అమిత్ షాకు జగన్పై ఫిర్యాదులు..
ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల సమీక్ష నిర్ణయం పైన ఇప్పటికే కేంద్ర ఇంధన శాఖ అధికారులతో పాటు గా ..స్వయంగా కేంద్ర మంత్రి సింగ్ సైతం లేఖ రాసారు. ఈ సమీక్ష కారణంగా పెట్టుబడి దారుల్లో ఆందోళన వ్యక్తం అవు తుందని ఇది మొత్తంగా ఆ రంగం మీదే ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. అయినా సీఎం జగన్ ఏపీ అసెంబ్లీలోనే ఈ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసారు. ఇక, తాజాగా హైకోర్టు సైతం ఏపీ ప్రభుత్వ నిర్ణయం పైన స్టే విధించింది. నాలుగు వారాల పాటు ప్రభుత్వం రాసిన లేఖలతో పాటుగా జారీ చేసిన జీవో మీద స్టే ఇచ్చింది. ఇదే సమయంలో కేంద్ర మంత్రి సింగ్ నేరుగా అమిత్ షాకు ఏపిలో పీపీఏల విషయం లో జరుగుతున్న వ్యవహారాన్ని వివరించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని నిరూపణ అవుతే..సంబంధిత పీపీఏ మీద సమీక్ష చేయవచ్చని..అన్ని పీపీఏల మీద సమీక్ష చేయటం సరికాదని అమిత్షాకు వివరించారు. దీని పైన తాము జరిపిన సంప్రదింపులను షాకు అందించారు.
75 శాతం స్థానికులకే ఉద్యోగాలు..పోలవరం అంశంలో..
తాజాగా ఏపీ ప్రభుత్వం పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే అవకాశం ఇవ్వాలని బిల్లును ఆమోదించారు. దీని పైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్తగా వచ్చే పరిశ్రమలకు వారికి కావాల్సిన శిక్షణ పొందిన ఉద్యోగులు స్థానికం గా అందుబాటులో ఉంటారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో.. ప్రభుత్వం స్థానికంగా లేకున్నా.. జిల్లా..లేదా రాష్ట్ర స్థాయిలో వారికి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించింది. విదేశీ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టిన సమయంలో స్థానికంగా ఉన్న వారికి కొంత మేర ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పందాలు ఉంటాయి. అదే ఇప్పుడు ఏకంగా 75 శాతం వరకు పెంచటంతో పెట్టుబడులు పెట్టేవారికి ఈ ప్రతిపాదన అడ్డుగా మారుతుందనే వాదన బీజేపీ నేతలు తెర మీదకు తెస్తున్నారు. ఇదే తరహాలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తే..మొత్తంగా పెట్టుబడుల మీదనే ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తన్నారు. ఇక, పోలవరం విషయంలో సైతం నిపుణుల కమిటీ వేయటం..ప్రస్తుత కాంట్రాక్టు రద్దు చేసి..రివర్స్ టెండరింగ్కు వెళ్లటం పైన కేంద్రంలో చర్చ సాగుతోంది.
చంద్రబాబు కోసం ఏపీకి నష్టం చేస్తారా..షా చెప్పిందేంటి..
చంద్రబాబు అవీతినిని బయటకు తీసేందుకు అనేక మార్గాలు ఉన్నాయని..ఏకంగా ప్రాజెక్టుల మీద ప్రభావం చూపే విధంగా కొత్త ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయనే చర్చ కేంద్ర ప్రభుత్వంలో సాగుతోంది. పోలవరం టెండర్లు రద్దు చేసి..రివర్స్ టెండరింగ్కు వెళ్తే అది ఖచ్చితంగా ప్రాజెక్టు నిర్మాణం మీద ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందునా.. కేంద్రం ఫండింగ్ చేస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టు..దీని పైన ప్రతీ బిల్లుకు పీపీఏ ఆమోదం తరువాతనే బిల్లులు చెల్లిస్తున్నామని కేంద్రంలోని అధికారులు చెబుతున్నారు. చంద్రబాబుకు సంబంధించిన అవినీతి ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవటంలో తప్పు లేదని కేంద్రం అభిప్రాయ పడుతోంది. జగన్ నిర్ణయాల పైన మంత్రులు చెప్పిన సమాచారం విన్న అమిత్ షా..తాను వాస్తవాలు ఏంటో తెలుసుకుంటానని.. అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే అడ్డు చెప్పాల్సిన అవసరం లేదని అభిప్రాయపడినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో ఇతరత్రా నష్టాలు జరగకుండా సూచనలు చేద్దామని ప్రతిపాదించనట్లు తెలుస్తోంది.