జగన్ ప్రభుత్వంలోనూ "తమ్ముళ్ల"దే పెత్తనం: తొలగరు..తొలిగించరు: వైసీపీ నేతలకు ఛాన్స్ ఎప్పుడు
ఏపీలో ప్రభుత్వం మారి 50 రోజులు అవుతోంది. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు స్వీకరించి 40 రోజులు అయింది. జగన్ సీఎం అవుతే తమకు రాజకీయంగా గుర్తింపు వస్తుందని ఎంతో మంది వైసీపీ నేతలు ఆశించారు. మంత్రి పదవుల్లోనూ జగన్ అనుసరించిన సామాజిక ఫార్ములా కారణంగా చాలా మంది సీనియర్లకు మంత్రి పదవులు దక్కలేదు. రెండేళ్ల తరు వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పటం ద్వారా జగన్ వారిలో ఆశలు సజీవంగా నిలిపారు. ఇక, నామినేటెడ్ పోస్టు ల్లో అయినా అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నా..ఎప్పటికో క్లారిటీ రావటం లేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా ఇంకా టీడీపీ నేతలే నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు. వారు తొలగరు..ప్రభుత్వం తొలిగించదు..ఏం జరుగుతోంది...
సీఎంగా జగన్...పదవుల్లో టీడీపీ నేతలు..
ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగుతున్నారు. కానీ, పలు సంస్థల ఛైర్మన్లుగా టీడీపీ నేతలే ఇప్పటికీ ఉన్నారు. అనధికా రికం గా వారు అధికారం కోల్పోయినా..అధికారికంగా మాత్రం వారే ఇంకా అక్కడ అధిపతులు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వకరించి 40 రోజులు దాటినా వారు మాత్రం పదవులు వీడటం లేదు. ఆర్టీసీ చైర్మన్గా ఉన్న వర్ల రామయ్య ..ఎస్సీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్.. శాప్ చైర్మన్ అంకమ్మ చౌదర.., ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరే షన్ చైర్మన్ నాగుల్ మీరా.. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దివి శివరాం..స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నామన రాంబాబు..పలువురు ఆర్టీసీ రీజియన్ చైర్మన్లు ఇంకా ఆ పదవులను పట్టుకుని వేలాడుతూ నే ఉన్నారు. ప్రభుత్వం మారితే సహజంగా గత ప్రభుత్వంలో నియమితులైన వారు రాజీనామా చేస్తారు. కానీ, వీరు మాత్రం తమ పదవులను వీడటానికి ఇష్టపడటం లేదు. టీడీపీ అధినేత సైతం వీరికి పదవులు వీడమని చెప్పటం లేదు. దీంతో..ప్రభుత్వమే అవసరమైతే తొలిగిస్తుందిలే అనే భావనతో ఉన్నట్లు కనిపిస్తోంది.
వైసీపీ నేతల నిరీక్షణ...
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమకు గుర్తింపు లభిస్తుందని అనేక మంది పార్టీ నేతలు ఆశించారు. కేబినెట్లో తమకు బెర్త్ ఖాయం అనుకున్న అనేక మంది సీనియర్లకు సైతం జగన్ తన సామాజిక సమీకరణాల లెక్కలతో చాన్స్ ఇవ్వలేనని స్పష్టం చేసారు. రెండేళ్ల తరువాత కొందరికి అవకాశం దక్కుతుందని ఇంకా కొందరిలో ఆశలు సజీవంగా ఉంచారు. ఇదే సమయంలో మరి కొంత మందికి ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు దక్కుతాయనే సంకేతాలు పార్టీ నుండి అందాయి. అయితే, ఒక్కొక్కరుగా కాకుండా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు ఒకే సారి భర్తీ చేయాలనే ఉద్దేశం తో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా తెలుస్తోంది.అయితే, ఇప్పుడు అనేక పదవుల్లో ఇంకా కొనసాగుతున్న టీడీపీ నేతలను ఏం చేయాలనే దాని పైన ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గతంలో టీటీడీ చైర్మన్గా వ్యవహరించిన పుట్టా సుధకర్ యాదవ్ సైతం రాజీనామాకు ఇలాగే మొండికేసారు. ఆ తరువాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. రాజకీయ విమర్శ లతో తన పదవికి రాజీనామా చేసారు. ఇప్పుడు వీరి విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
ప్రభుత్వం వారిని తొలిగిస్తుందా...
నామినేటెడ్ పదవుల్లో గత ప్రభుత్వంలో నియమితులైన వారు వారంతటగా వారు తప్పుకుంటారని ప్రభుత్వం ఇన్ని రోజులు ఎదురు చూసింది. అయితే, ఇప్పటికీ కొందరు నామినేటెడ్ పదవులను వీడకుండా అలాగే కొనసాగుతున్నారు. వీరిని తప్పిస్తేనే కొత్త వారికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో..ఇప్పుడు వీరిని తొలిగించేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాల పైన కసరత్తు జరుగుతోంది. దేవాలయ పాలక మండళ్ల వ్యవహారంలో ఏపీ అసెంబ్లీలో కొత్తగా బిల్లును ప్రతి పాదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి..ఇతర నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారిని ప్రభుత్వమే తొలిగిస్తే వచ్చే లాభ నష్టాల పైన బేరీజు వేస్తోంది. శాసనసభా సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయంలో ఎమ్మెల్యేల నుండి నామినేటెడ్ పదవుల కోసం సీఎం జగన్ పైన మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మరి..సీఎం జగన ఈ వ్యవహారం లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది.