టీడీపీకి జ్యోతుల..త్రిమూర్తులు గుడ్ బై !! నెహ్రూ కు జగన్ ఛాన్స్ ఇస్తారా: తోట రూటు వైసీపీ వైపే..!!
తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ కీలకంగా ఉన్న నేతలు ఒక్కొక్కరూ పార్టీకి దూరం అవుతున్నారు. ప్రత్తిపాడు ఇన్ ఛార్జ్ వరుపుల రాజా పార్టీకి రాజీనామా చేయగా.. మరో ఇద్దరు నేతలు సైతం అదే బాటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. జిల్లాకు చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తులు టీడీపీ అధినాయకత్వం మీద ఎన్నికల సమయం నుండి ఆవేదనతో ఉన్నారు. అప్పట్లోనే ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరిగినా..ఆయన టీడీపీ నుండే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
అయితే, వైసీపీ నేతగా ఉన్న ఆమంచి క్రిష్ణ మోహన్ ను ఆయన్ను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అదే విధంగా వైసీపీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉంటూ టీడీపీలోకి ఫిరాయించిన జ్యోతుల నెహ్రూ సైతం పార్టీ వీడుతారని ప్రచారం సాగుతోంది. అయితే, ఆయన వైసీపీలోకి రావాలని భావించినా..ముఖ్యమంత్రి ఆయనకు అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడు చర్చకు కారణమైంది. ఇదే విధంగా మరి కొందరు టీడీపీ వీడేందుకు సిద్దంగా ఉన్నారని సమాచారం.
రౌడీ షీటర్ల మేళా ... తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైమ్ ..వరంగల్ పోలీసుల సెన్సేషన్
తూర్పులో టీడీపీలో వలసలు..
టీడీపీకి రాజకీయంగా గట్టి పట్టు ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో వరుస దెబ్బలు తగులుతున్నాయి, తాజాగా ఎన్నికల్లో టీడీపీ కేవలం నాలుగు స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఆ తరువాత కాకినాడ కేంద్రంగా టీడీపీ నుండి పోటీ చేసిన కాపు నేతలు సమావేశమై..అధినాయకత్వం తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని వాపోయారు. ఆ తరువాత పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి టీడీపీకి రాజీనామా చేసి బీజీపీలో చేరారు. అదే విధంగా .. ప్రత్తిపాడు అభ్యర్ధిగా పోటీ చేసిన వరుపుల రాజా సైతం టీడీపీ వీడారు. ఇప్పుడు మరి కొందరు అదే బాటలో ఉన్నారని జిల్లా పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది . ఈ విషయం తెలియటంతో పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 5,6 వ తేదీల్లో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు. మరెవరూ పార్టీ మారకుండా బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందు కోసమే కాకినాడలో రెండు రోజుల పాటు బస చేయనున్నారు. ఇదే సమయంలో జిల్లా టీడీపీలో కీలకంగా ఉన్న పలువురి పేర్లు పార్టీ వీడుతున్నట్లుగా ప్రచారం లో ఉన్నాయి. అయితే వారిలో ప్రధానంగా తోట త్రిమూర్తులు..జ్యోతుల నెహ్రూ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
తోట త్రిమూర్తులతో టచ్ లో వైసీపీ నేతలు..
ఎన్నికల సమయం నుండే తోట త్రిమూర్తులు పార్టీ అధినాయకత్వం మీద అసంతృప్తితో ఉన్నారు. అయినా..చంద్రబాబు సూచన మేరకు ఆయన టీడీపీ నుండే పోటీ చేసారు. ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత కొద్ది రోజులకే టీడీపీ నుండి పోటీ చేసిన కాపు నేతలు త్రిమూర్తులు నాయకత్వంలో కాకినాడలో సమావేశం అయ్యారు. ప్రధానంగా కాపు వర్గానికి చెందిన నేతలకు ఎన్నికల ఖర్చులకు నిధులు అందించ లేదని..ఒక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇచ్చారనేది ఆ సమావేశంలో చర్చకు వచ్చింది. పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన సమయంలోనూ ఈ అంశాలను నేతలు ప్రస్తావించారు. అదే విధంగా లోకేశ్ కారణంగా నష్టం జరుగుతోందని చంద్రబాబుకు వివరించారు. ఆ తరువాత వీరంతా సైలెంట్ అయ్యారు. అయితే, పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారని పార్టీ ద్వితీయశ్రేణి నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుండి బీజేపీలో చేరిన కొందరు ముఖ్యులు సైతం తోట త్రిమూర్తులను బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయంగా గట్టి పట్టు ఉన్న నేత కావటం..సామాజికంగా మంచి సత్సంబంధాలు ఉండటంతో తోట త్రిమూర్తులను చేర్చుకొనేందుకు బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన సన్నిహితుడు.. వైసీపీ నేత ఆమంచి క్రిష్ణ మోహన్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. త్రిమూర్తులను వైసీపీలోకీ తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. త్రిమూర్తులు దీని పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
జ్యోతుల నెహ్రూ కు వైసీపీలో ఛాన్స్ ఉంటుందా..
ఇక, 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి జగ్గంపేట ఎమ్మెల్యే గా గెలిచి.. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో డిప్యూటీ లీడర్ గా వ్యవహరించిన జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి ఫిరాయించారు. తాజా ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. నెహ్రూ టీడీపీలో కొంత యాక్టివ్ గా కనిపిస్తున్నా.. ఆయన మీద పార్టీ మారాలనే ఒత్తిడి ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కాపులకు గత ప్రభుత్వం ఇబీసీ రిజర్వేషన్ల కింద అయిదు శాతం ఇచ్చిన కోటాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సమయంలో ఆయన ముఖ్యమంత్రి మీద విమర్శలు చేసారు. టీడీపీ తరపున కాపు వాయిస్ గా వ్యవహరించారు. అయితే, ఇప్పుడు ఆయన సైతం వైసీపీలోకి రావాలనే ఆలోచనలో ఉన్నారని జిల్లాలో ప్రచారం. అయితే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం వైసీపీలోకి జ్యోతుల తిరిగి వస్తే అందకు అంగీకరించే పరిస్థితి లేదని జిల్లాలోని వైసీపీ నేతలు ఓపెన్ గా చెబుతున్నారు. కానీ, జ్యోతుల నెహ్రూ టీడీపీ వీడుతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు జిల్లా పర్యటన ముగిసిన తరువాత పార్టీ మార్పు పైన జ్యోతుల నెహ్రూతో పాటుగా పలువురు కీలక నేతలు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.