2014 పాఠం వైసీపీ మర్చిపోయిందా : టీడీపీని మించిపోతున్న వైసీపీ: అప్పుడే మంత్రులుగా....!
2019 ఎన్నికలు పూర్తయ్యాయి. కానీ, వైసిపి నేతలు ఎప్పటికీ మర్చిపోలేని ఫలితం 2014 ఎన్నికలు. విజయం చేతుల వరకూ వచ్చి..నేతల అతి విశ్వాసం..దెబ్బ తీసింది. ఆ ఎన్నికల నుండి గుణపాఠం నేర్చుకొని జగన్ పాదయాత్ర నుండి ఎన్నికల వరకు జాగ్రత్తగానే అధినాయకత్వం వ్యవహరించింది. కానీ, కొద్ది రోజులుగా వైసిపి నేతలు టిడీపీ నేతలను మించిపోతున్నారు. అప్పుడే ఊహాల్లో విహరిస్తున్నారు. ప్రజల మధ్య చర్చకు కారణమవుతున్నారు...
ఊహల్లో విహరిస్తూ వైసిపి నేతలు..
ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. వైసీపీకి అనుకూలంగా సర్వేలు ఉన్నాయి. అయినా..ఫలితాలు మాత్రమే విజయమో..కాదో నిర్ధారించేది. ఈ సమయంలోనే వైసీపీలో కొంత మంది ఔత్సాహికులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఫలితాలు రాకముందే..వైసీపీ అధికారంలోకి వస్తుందో రాదో తేలకముందే..అసలు వారు ఎమ్మెల్యేగా గెలుస్తారో లేదో..ఖరారు కాకముందే మంత్రులుగా ప్రచారంలో ఉంటున్నారు. నోటి ప్రచారం అయితే..ఒక ఎత్తు. ఏకంగా నియోజకవర్గాల్లో ఫ్లెక్సీల మీద కాబోయే మంత్రి అంటూ ప్రచారం చేస్తున్నారు. జగ్గయ్యపేట వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను కాబోయే మంత్రి వర్యులంటూ ఆయన అనుచరులు బ్యానర్లు కట్టారు. జగ్గయ్యపేట పట్టణ మున్సిపల్ ఛైర్మన్ రాజగోపాల్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఆ బాటిల్పై కాబోయే మంత్రి ఉదయభాను అంటూ స్టిక్కర్లు అంటించారు. ఇప్పుడు ఇది చూసిన సామాన్యులు సైతం చర్చ మొదలు పెట్టారు.
గెలుస్తారనటం వేరు..గెలవటం వేరు..
ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని సర్వేలు చెప్పినా..జగన్ ధీమా వ్యక్తం చేసినా..ప్రశాంత్ కిషోర్ టీం అంచనాలు వేసినా.. గెలుస్తారని చెప్పటం వేరు..గెలవటం వేరు. ఫలితాలు రాకముందే ఇలా ప్రచారం చేసుకోవటం వలన వారి రాజకీయ భవిష్యత్ తో పాటుగా పార్టీ మీదా ప్రభావం ఉంటుందని కొందరు వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, జిల్లాల్లో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో పూర్తిగా పార్టీ అధినేత నిర్ణయిస్తారని..అసలు, ఫలితాలే రాకముందే ఇలా చేయటం వలన ఆ జిల్లాల్లో పార్టీకి నష్టం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు తమ ప్రభుత్వమే కొనసాగుతుందని.. తామే మంత్రులుగా ఉంటామంటూ కొన్ని చోట్ల హడావుడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా వైసీపీ నేతలు వారితో పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఇటువంటి హడావుడి బ్యానర్లు ప్రజల్లో చర్చకు కారణమవుతున్నాయి.
2014 గుణపాఠం మరిచిపోయారా..
వైసీపీకి 2014 ఎన్నికల ఫలితాలు ఒక గుణపాఠంగా నిలిచిపోతాయి. నాటి రాజకీయ పరిస్థితుల్లో జగన్ మేనియా.. వైస్సార్ సానుభూతి కలిసి జగన్ సీఎం అవ్వటం ఖాయమంటూ వైసీపీ నేతలు పోలింగ్ ముగిసిన నాటి నుండే అతిగా ప్రచారం చేసారు. మంత్రులుగా ఎవరు ఉంటారనేది చర్చలు చేసారు. తామే అధికారంలోకి వచ్చేసామంటూ ధీమా వ్యక్తం చేసారు. కానీ, ఫలితం రివర్స్ అయింది. ఆ తరువాత చేసిన పోస్టుమార్టంలో తాము చేసిన పొరపాట్లు ఏంటో వైసీపీ అధినేత విశ్లేషించుకున్నారు. అప్పటి నుండే 2019 ఎన్నికలకు సమాయత్తం అయ్యారు. ప్రణాళికా బద్దంగా ఈ సారి వ్యవహరించినట్లు కనిపించింది.కానీ, ఇప్పుడు ఎవరూ ఫలితాలు వచ్చే వరకూ అతిగా స్పందించవద్దంటూ నేరుగా పార్టీ అధినేత సూచించారు. అయినా, కొందరి తీరు మాత్రం మారలేదు.