పవన్ కళ్యాణ్పై కేఈ కృష్ణమూర్తి తీవ్రవ్యాఖ్యలు: 'అందుకే జగన్కు జనసేనాని మద్దతు'
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఉప ముఖ్యమంత్రి, టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ అంటే ఓ గాలి అన్నారు. పవన్కు గాలి మాటలు మాట్లాడటం అలవాటుగా మారిందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Recommended Video
పవన్ కళ్యాణ్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువకూడదన్నారు. ఆయన ఇతరులు ఇచ్చిన దానిని చెబుతున్నారన్నారు. గాలి వార్తలను నమ్మి వాటిని వల్లించడమే ఆయనకు తెలుసునని ఎద్దేవా చేశారు. స్వయంగా వివేకంతో విశ్లేషించే శక్తి లేని వ్యక్తి పవన్ అన్నారు. ఎవరో చెబితే అదే నిజం అనుకొని మాట్లాడుతారని మండిపడ్డారు.
రమణదీక్షితులుకు మద్దతు దారుణం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పైన తీవ్ర అభియోగాలు చేశారని కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. రమణదీక్షితులుకు పవన్ మద్దతు పలకడం దారుణం అన్నారు. దీని వెనుక రాజకీయ కుట్ర తేలిపోతోందన్నారు. శ్రీవారి నగలపై ఇప్పటికే 2 కమిటీలు నివేదిక ఇచ్చాయన్నారు.
ట్విట్టర్ ద్వారా వేరేవాళ్లు ఆరోపణలు చేయిస్తున్నారు
తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత దుష్ప్రచారం చేస్తున్నారని కేఈ ధ్వజమెత్తారు. పవన్తో ట్విట్టర్ ద్వారా ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, వైసీపీ, జనసేనలు కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేనలు కలిసి వెళ్తాయని ఇప్పుడే చెప్పలేమన్నారు.
వరప్రసాద్ వ్యాఖ్యలపై పవన్ స్పష్టత ఇవ్వాలి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుపైన పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వాలని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. ఎవరితో వెళ్లాలనే విషయమై పవన్ స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. జగన్, పవన్ కళ్యాణ్లు కలిసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు.
అందుకే పవన్ మద్దతు కోరుతున్న జగన్
పవన్ కళ్యాణ్ అభివృద్ధికి సహకరిస్తారా లేదా అరాచకానికి అండగా ఉంటారా తేల్చి చెప్పారని బోండా ఉమ అన్నారు. జగన్ పాదయాత్రకు స్పందన ఉండటం లేదనే జనసేనాని మద్దతును వైసీపీ ఆశిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. కాగా, అంతకుముందు వైసీపీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తమతో కలవాలనుకున్నది వాస్తవమేనని, ఆయన జగన్కు మద్దతిస్తానని చెప్పారని తెలిపారు. దీనిపై బోండా ప్రశ్నించారు.