nara lokesh: విజయలక్ష్మీ, షర్మిల ఎక్కడ, మహిళల రోదన పట్టదా..?
అమరావతి రాజధాని కోస ఏపీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. విజయవాడలో 3 వేల మంది మహిళలు కదం తొక్కగా.. వారిని పోలీసులు అరెస్ట్ చేసి, విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి స్పందించారు. రైతులు, మహిళలపై జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు. రాజధానిలో మహిళలను పోలీసులు బూటు కాళ్లతో తంతున్నారని లోకేశ్ ఫైరయ్యారు. మహిళలను ఇంత అవమానిస్తుంటే.. వైఎస్ విజయలక్ష్మీ, షర్మిల ఎక్కడ ఉన్నారు..? చూస్తున్నారా అని లోకేశ్ ప్రశ్నించారు.
ఏపీలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను చూస్తున్నారా అని లోకేశ్ వారిని అడిగారు. రాజధానిగా అమరావతి ఏర్పాటు ఏకపక్ష నిర్ణయం కాదని గుర్తుచేశారు. అసెంబ్లీలో రాజధాని ఏర్పాటుపై విసృత చర్చ జరిగిందనన్నారు. అమరావతి రాజధాని ఏర్పాటుపై అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారని చెప్పారు. సోమవారం గుంటూరు జిల్లా బాపట్లలో నారా లోకేశ్ మాట్లాడారు.
మూడు రాజధానుల ఏర్పాటు అనే అంశం పిచ్చి ప్రతిపాదన అని లోకేశ్ విమర్శించారు. దీంతో పని ఉన్న సామాన్యులు.. రాజధాని చుట్టూ తిరిగేందుకే సమయం సరిపోతుందని చెప్పారు. అధికారులు కూడా అటు, ఇటు తిరగాల్సి రావడంతో పాలన పడకేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం 33 వేల ఎకరాల భూములను ఇచ్చారని చెప్పారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులను అవమానించడం సరికాదని హితవు పలికారు.
అమరావతిలో పోలీసుల అరాచకం పరాకాష్టకు చేరిందని విమర్శించారు. మహిళలు అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించడం సరికాదన్నారు. మహిళలను పోలీసులు బూటు కాలుతో తన్నడం ఏంటీ అని మండిపడ్డారు. గుంటూరు రూరల్ ఎస్పీ లాఠీ పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అని ప్రశ్నించారు. పోలీసు బాస్ డీజీపీ కుటుంబసభ్యులతో కూడా పోలీసులు ఇలాగే ప్రవర్తిసారా అని అడిగారు. అలా బీహేవ్ చేస్తే మీరు ఊరుకుంటారా అని నిలదీశారు. కానీ పోలీసులు పద్ధతి మాత్రం సరికాదని వారు చేసే అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.