దళితులపై దమనకాండ: పీఎస్లో యువకుడిపై దాడి, శిరోముండనం.. నారా లోకేశ్ ఫైర్
జగన్ రెడ్డి రాజ్యంలో దళితులకు జీవించే హక్కు లేదా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న దాడులను ఖండించారు. రాష్ట్రంలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని లోకేశ్ ఫైరయ్యారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు అనుకూలంగా ప్రవర్తిస్తూ.. దళిత యువకులపై దాడుల చేయడం సరికాదన్నారు. మరోవైపు కరోనా క్వారంటైన్ కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవు.. ఈ మేరకు లోకేశ్ ట్వీట్లు చేశారు.
శిరోముండనం చేసి..
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వైసీపీ నేత ఇసుక అక్రమ రవాణాను దళిత యువకుడు వరప్రసాద్ అడ్డుకున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. అయితే అతనిని పోలీసు స్టేషన్ తీసుకెళ్లి దాడి చేయడమే గాక.. శిరోముండనం చేశారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు మడుగులొత్తి ఈ విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. వారు పోలీసులా.. లేదా గుండాలా అని ట్వీట్ చేశారు.
దళితులపై దాడులు
వీరేకాదు ఇదివరకు మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ను నడిరోడ్డుపై హింసించి పిచ్చోడిని చేసి చంపేయాలని చూశారని ఆరోపించారు. అవినీతికి సహకరించలేదని డాక్టర్ అనితారాణిని వేధించారని గుర్తుచేశారు. దళిత న్యాయమూర్తి రామకృష్ణపై భౌతికదాడికి దిగారని.. రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదా అని ప్రశ్నించారు.
కనీస వసతులు లేవు..
ఇటు కరోనా క్వారంటైన్ కేంద్రాల్లో సరైన వసతులు లేవు అని లోకేశ్ చెప్పారు. కానీ మీడియా సమావేశాల్లో మాత్రం సీఎం జగన్ ఆహా ఓహో అని చెబుతారని గుర్తుచేశారు. కనీస వసతులు లేవు అని బాధితులు చెబుతోన్నా పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో మోహనరావు అనే రోగి సరైన వసతి లేదు అని సెల్ఫీ వీడియో ద్వారా పేర్కొన్న విషయాన్ని ట్వీట్ చేశారు.
Recommended Video
పెట్రో, డీజిల్ వాత
పెట్రో, డీజిల్పై వ్యాట్ మోతపై కూడా లోకేశ్ స్పందించారు. కరోనా సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజల కష్టాన్ని దోచారు. ఆ తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.1.24 పైసలు, డీజిల్ పై 93 పైసలు పెంచేసి.. వాహనదారుల నడ్డి విరించారని పేర్కొన్నారు. దీనిని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ధరలు పెంచి మద్యనిషేధం అన్న మేధావి జగన్.. కరోనా కట్టడికి పెట్రోల్ ధరలు పెంచానంటారేమో అని సెటైర్లు వేశారు.