ఆ ప్రమాదాలకు...ఈ పరిహారాలు ఉన్నాయి:తప్పక తెలుసుకోండి!
అమరావతి:నాగరికత వృద్ధి చెందేకొద్దీ మానవుడి జీవితంలో యంత్రాల పాత్ర పరిథి మరింతగా పెరిగిపోతందనేది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. అయితే మానవుడి మనుగడలో ఈ యంత్రాలు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో...అవే యంత్రాలు కొన్నిసార్లు మనిషి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయనేది కూడా నిజమే!...
మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి?...అందుకే ఇలాంటి ప్రమాదాలు తలెత్తినప్పుడు ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని భీమా పథకాలు అమలు చేస్తున్నాయి. సాధారణంగా మనం భీమా అనగానే మనం సొమ్ము చెల్లించి అర్హత పొందాల్సి ఉంటుంది. కానీ కొన్ని విపత్తులకు సంబంధించి మనం ఒక్క రూపాయి కూడా చెల్లించకపోయినా పరిహారం పొందేందుకు వీలుంది. అలాంటి పరిహారాలపై అవగాహన లేకుండా ప్రజలు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో ఈ కథనం మీకోసం...
వివిధ ప్రమాదాలు...పరిహారాలు
వంట గ్యాస్, రైల్వే ప్రయాణం, బ్యాంకుల్లో మనం దాచుకున్న నగదు, ఇతర మరి కొన్ని కారణాలు వల్ల ప్రమాదాలు సంభవించి మరణించినా భీమా వారికో లేదా వారి కుటుంబానికో అండగా నిలుస్తుంది. మనం ప్రీమియం కట్టకుండానే పాలసీదారుడి ఎలా అవుతామో, అలాగే వినియోగదారుడిగా, ప్రత్యేక హక్కుగా కూడా మనం పరిహారం పొందే అవకాశం కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాల వల్ల మనకు లభిస్తోంది.
రైలు ప్రయాణం...పరిహారం ఇలా
ప్రజా రవాణా వ్యవస్థలో రైలు ప్రయాణం అతి కీలకమైనది. అయితే ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ రైల్వే బీమా వర్తిస్తుంది. ప్యాసింజర్, సబ్ అర్బన్ రైళ్లు మినహాయించి మిగిలిన అన్ని రైళ్ల రిజర్వేషన్ తరగతుల ప్రయాణికులకు ఇది వర్తిస్తుంది. ప్రయాణం చేసినప్పుడు చోరీలు, టెర్రరిస్టుల దాడులతో పాటు ఊహించని ఘటనలకు కూడా బీమాగా సొమ్ము పొందే అవకాశం ఉంది. అయితే టికెట్లు కొనుగోలు సమయంలోనే బీమా సౌకర్యాన్ని ఎంపిక చేసుకోవాలి. ఖచ్చితమైన సమాచారం సెల్ నంబర్, ఈ-మెయిల్ చిరునామా, పాన్ నంబర్లను టికెట్ రిజిస్ట్రేషన్ ఫారంలో నమోదు చేయాల్సివుంటుంది. అలాగే బుక్ చేసుకున్న టికెట్ను భద్రంగా ఉంచుకోవాలి.
పీఎం...చంద్రన్న భీమా
పేద, అసంఘటిత కార్మికుల కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ పీఎం చంద్రన్న బీమా పథకం నిజంగా బడుగు బలహీనవర్గాలను ఆదుకుంటున్న వైనం ఆ కుటుంబాన్ని అడిగి తెలుసుకుంటేనే దీని విలువ తెలుస్తుంది. 2016 అక్టోబరులోప్రవేశపెట్టిన ఈ పథకంలో సంబంధిత ప్రీమియం మొత్తం ప్రభుత్వాలే సభ్యుడు పేరు మీద బీమా సంస్థకు చెల్లిస్తాయి. అయితే అందుకు మనం చేయాల్సిందల్లా ఒక్కటే!...పల్స్ సర్వేలో చంద్రన్న బీమాలో సభ్యుడిగా నమోదు చేసుకొని పథకానికి అర్హత పొందడమే. ఏ కారణంగా అయినా సహజంగా చనిపోతే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షలు పరిహారం బీమా సంస్థలు ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. చనిపోయిన 24 గంటల లోపు చంద్రన్న బీమా పిలుపుకేంద్రానికి సమాచారం తెలియజేయాలి. ఈ ఏడాదిలో 12,55,892 మంది సభ్యత్వం పొందారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా పరిహారం పొందిన క్లెయిమ్స్ 7,757 కాగా వాటి కోసం చెల్లించిన మొత్తం రూ.75.27 కోట్లు.
వంట గ్యాస్...ప్రమాదాలకు...
వంట గ్యాస్ సిలిండర్ కారణంగా ఏదేని ప్రమాదం సంభవిస్తే రూ.5 లక్షల రూపాయల వరకు నష్ట పరిహారాన్ని పొందే అవకాశం ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇది కుటుంబ సభ్యులతో పాటు పంపిణీదారులకు తీసుకునే థర్ట్పార్టీ లయబిలిటీ కింద ప్రమాదంలో గాయపడిన ఇతరులు కూడా బీమా పొందేందుకు అర్హులు. బాధితుడి వయస్సు, ఆయన నెలసరి ఆదాయం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని బోర్డు ఈ నష్టపరిహారాన్ని నిర్ణయిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీస్స్టేషనులో ఫిర్యాదు చేయాలి. గ్యాస్ పంపిణీదారు ఆ గ్యాస్ పంపిణీ బీమా సంస్థకు ఈ విషయం తెలియజేసేలా చూసుకోవాలి. ఘటనా స్థలికి అటు పోలీసులు ఇటు గ్యాస్ బీమా సంస్థ నియమించిన సర్వేయరు పరిశీలించి గ్యాస్ సిలిండర్తోనే ప్రమాదం జరిగిందని నిర్థారణ జరిగితే పరిహారం అందుతుంది. అయితే ఐఎస్ఐ మార్క్ గలిగిన పరికరాలను వాడిన ఎల్బీజీ వినియోదాగరులే ఈ బీమాకు అర్హులవుతారు.
బ్యాంకులో డబ్బుకు...భరోసా
ప్రస్తుతం భారత దేశంలో కోట్లాదిమంది ఖాతాదారులు సేవింగ్స్, కరెంట్, రికరింగ్, జన్థన్ ఖాతాల ద్వారా బ్యాంకు సేవలు పొందుతున్నారు. ఇలా లక్షలాది బ్యాంకుల్లో ఖాతాదారుల సొమ్ములు డిపాజిట్ల రూపంలో రూ.కోట్లలో ఉన్నాయి. ఏదేని కారణం చేత బ్యాంకు ఆ సొమ్మును తిరిగి చెల్లించని పక్షంలో మనకు అసలుతో పాటు వడ్డీ కూడా అందే వీలుంది. ఒకవేళ బ్యాంకు లైసెన్సు రద్దయినా...ఆ బ్యాంకు వేరే బ్యాంకులో విలీనమైనా ఇది వర్తిస్తుంది. భారత రిజర్వు బ్యాంకు అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ మనకు రూ. లక్ష నష్టపరిహారం అందజేస్తుంది. అందుకు సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్ ఖాతాదారులు అర్హులు. అయితే ఎంత సొమ్ము దాచుకున్నా ఇన్సూరెన్స్ మనీగా రూ.లక్ష మాత్రమే అందుతుంది.
విమాన ప్రయాణంలో...సామగ్రికి భద్రత...
విమాన ప్రయాణంలో ప్రమాదం, సామగ్రి తప్పిపోవడం, ఆలస్యంగా అందడం వంటి సంఘటనలు చాలామందికి ఎదురవుతూ ఉంటాయి. దీనివల్ల ప్రయాణం డిస్ట్రబ్ కావడం, విలువైన వస్తువులు కోల్పోవడం జరుగుతుంది. అదే మనం నష్టపోయినందుకు పరిహారం లభిస్తే కొంతయినా ఊరటగా ఉంటుంది. ప్రయాణికులకు ఏమైనా ప్రమాదం జరిగినా వారికి బీమా వర్తింపు, అలాగే సామాగ్రి పోయినా ఎయిర్లైన్స్ సంస్థ నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇందుకోసం కొనుగోలు చేసిన టికెట్ను జత చేస్తూ సదరు ఎయిర్లైన్స్ సంస్థకు మనకు జరిగిన నష్టం గురించి ఫిర్యాదు చేస్తే మనకు ఓ సంఖ్యను ఇస్తారు. తక్కువ కాలంలోనే ప్రామదం, సామగ్రి, ప్రాధాన్యతను బట్టి బీమా పరిహారం అందుతుంది.