ఆ సర్వేలను నమ్ముకుంటే అంతే, సీయం కు మంత్రి లేఖ : ఏపి ప్రభుత్వంలో కలకలం..
ఏపి ప్రభుత్వాధినేత నిరంతరం ప్రజల్లో ప్రభుత్వం పై ఉన్న సంతృప్తి స్థాయి లెక్కలు చెబుతూ ఉంటారు. ఏ పధకం పై ఏ స్థాయిలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వివరిస్తూ ఉంటారు. కానీ, ఇప్పుడు ఆ లెక్కలు తప్పని..ఆ సర్వేలను నమ్ముకుంటే మొత్తానికే మోసం వస్తుందని ఓ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రికి లేఖ రాసారు. ఇప్పుడు ఇది ఏపి ప్రభు త్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా చేసుకొనే ప్రచారానికి ఇది సంకటంగా మారింది..
రియల్ టైం గవర్నెన్స్
ఏపి ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం చేపట్టినా..ప్రజల్లో ఆ కార్యక్రమానికి స్పందన ఎలా ఉందో తెలుసుకోవటం ఆనవాయితీ. ఇందు కోసం ముఖ్యమంత్రి తన ప్రభుత్వం రియల్ పాలన అందిస్తుందని చెప్పుకోవటానికి రియల్ టైం గవర్నెన్స్ ను తీసుకొచ్చారు. ప్రజలకు కావాల్సిన సమాచారం అందిచటం తో పాటుగా..ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కార దిశగా తీసుకెళ్లటం అక్కడి ఉద్యోగుల బాధ్యత. అయితే, తాజాగా ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలు..ప్రభుత్వ పనితీరు పై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది.
ఐవిఆర్యస్
ఇందు కోసం ప్రత్యేక కాల్ సెంటర్ నుండి ఫోన్ చేసి కొన్నింటికి కాల్ ఆపరేటర్లు స్వయంగా..మరికొన్ని ముఖ్యమంత్రి వాయిస్ ఐవిఆర్యస్ కు అనుసంధానం చేసి ఫోన్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. వారు చేసిన కాల్స్..వచ్చిన స్పందన ఆధారంగా శాతాన్ని లెక్కించి అది రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా ముఖ్యమంత్రికి నివేదిస్తున్నారు. సీయం సైతం వాటి ఆధారంగా సంతృప్తి స్థాయి లెక్కులు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారం పై ఏకంగా ఏపి మంత్రులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా వచ్చిన సర్వే నివేదికలను ప్రాతిపదికగా తీసుకుంటనే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.
పితాని సత్యనారాయణ
మంత్రులు పితాని సత్యనారాయణ, అచ్చం నాయుడు ఇదే రకమైన అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళా రు. ప్రభుత్వ పధకాలు..పని తీరు పై రియల్ టైం గవర్నరెన్స్ ఇచ్చిన సర్వే రిపోర్టులను ఆధారం చేసుకోవద్దని..అవి వాస్తవాలకు దగ్గరగా లేవని ఈ మంత్రులు సీయం దృష్టికి తీసుకొచ్చారని సమాచారం. ఈ మధ్య కాలంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆదరణ పధకం పై ఆర్టీజీఎస్ సిబ్బంది ఇచ్చిన నివేదిక ఆధారంగా సీయం సమావేశంలో ఫైర్ అయ్యారు.
మంత్రి అచ్చంనాయుడు
అయితే, ఆదరణ పధకం పై ఆ సిబ్బంది ఇచ్చిన నివేదికలు తప్పని ఆ శాఖ మంత్రి అచ్చంనాయుడు, అధికారి ఉదయలక్ష్మి చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో..ఇతర పధకాలపై రియల్ టైం గవర్నెన్స్ ఇస్తు న్న సర్వే వివరాలను పరిగణలోకి తీసుకోవద్దని మంత్రి పితాని సత్యనారాయణ స్వయంగా సీయం కు లేఖ రాసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఇది ప్రభుత్వ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించే రియల్ టైం గవర్నెన్స్..దాని నివేదికల పై ఏకంగా మంత్రులే అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం తో దీనికి కీలక బాధ్యత వహిస్తున్న ఐఏయస్ అధికారి అహ్మద్ బాబు పైనా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి..ఈ సర్వేలను నమ్ముకోకుండా ముందుకు వెళ్లాలన్న మంత్రుల సూచనలు ఎంత వరకు అమలవుతాయో చూడాలి.