కియాపై తప్పుడు ప్రచారం, 14 వేల కోట్లతో పెట్టుబడులు, వైఎస్ హయాంలోనే నాంది: మంత్రి బుగ్గన
కియా ప్లాంట్ ఎక్కడికీ తరలి వెళ్లడం లేదన్నారు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కంపెనీకి సంబంధించి తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. కంపెనీ తరలింపు గురించి కియా అధిపతి పార్క్ కూడా తెలియదని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. కానీ సేల్స్ హెడ్ భట్ పేరుతో పోస్టింగ్స్ ఎలా వచ్చాయని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
అదేం లేదే..
కియా ప్లాంట్ తమిళనాడుకు తరలిస్తున్నారని రాయిటర్స్ కథనంతో వివాదం చెలరేగింది. ఇటీవల కియా మరో ప్లాంట్కు శంకుస్థాపన చేశామని మంత్రి బుగ్గన తెలిపారు. ఏపీలో మరో ప్లాంట్ ఏర్పాటు చేయడంపై కంపెనీ హర్షం వ్యక్తం చేసిందని తెలిపారు. అండర్ బ్రిడ్జీ ఏర్పాటు చేయాలని కంపెనీ కోరితే వేశామని మంత్రి గుర్తుచేశారు.
అప్పుడే అంకురార్పణ
ఏపీలో కియా ప్లాంట్ ఏర్పాటు కావడానికి గల కారణం ఏంటో హెడ్ పార్క్ తనతో వివరించారని తెలిపారు. 2008లో హ్యుందాయ్ రిసెర్చింగ్ డెవలప్మెంట్లో పనిచేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ఆర్ కోరారని చెప్పారు. ఏపీలో ప్లాంట్ ఏర్పాటు కోసం అప్పుడే నాంది పడిందని బుగ్గన చెప్పారు. ఈ విషయాన్ని తనకు స్వయంగా పార్క్ తెలియజేశారని చెప్పారు. తర్వాత సీఎం జగన్కు లేఖ కూడా రాశారని వివరించారు.
14 వేల కోట్లు
కియా విషయంలో కొందరు గందరగోళం సృష్టించారని బుగ్గన మండిపడ్డారు. 14 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన కంపెనీపై అభాండాలు వేయడం సరికాదన్నారు. దీని వెనక ఎవరూ ఉన్నారో త్వరలో తేలుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. 1252 కంపెనీలకు 1052 ఎకరాల భూమి అలాట్ చేశామని మంత్రి బుగ్గన వివరించారు.