రోజా తీరు అసభ్యకరం, రౌడీ షీట్ ఓపెన్ చేయాలి: సోమిరెడ్డి, జగన్పై డొక్కా ఫైర్
హైదరాబాద్: అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాల్మనీ వ్యవహారంపై శాసనసభలో చర్చ జరగకూడదనేదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యోచనగా కనిపిస్తోందన్నారు. జగన్ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా తీరు అసభ్యకరంగా ఉందన్నారు. రోజా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే ఊరుకునేది లేదన్నారు.
రోజా ప్రవర్తనను పోలీసులు కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోజాపై రౌడీషీట్ తెరవాలని డిమాండ్ చేశారు. ఆమెను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ఆ నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారన్నారు. రోజా కోసం ప్రజా ప్రయోజనాలను తాకట్టుపెట్టాలా? అని ప్రశ్నించారు.
జగన్లో ఆవేశం తప్ప ఆలోచన లేదు: డొక్కా
అసెంబ్లీ జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందని, కొందరి సభ్యుల ప్రవర్తన ఎబ్బెట్టుగా ఉందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అంబేద్కర్పై చర్చ జరుగుతుంటే ఏపిలో ప్రతిపక్షం తీరు వ్యూహాత్మక తప్పిదం చేసిందని చెప్పారు.
జగన్లో ఆవేశం తప్ప ఆలోచన కనిపించడంలేదని ఎద్దేవాచేశారు. రోజాను సస్పెండ్ చేసే అధికారం సభకు ఉందని ఆయన తెలిపారు. దీనిపై జగన్ కోర్టుకు వెళ్తాననడం హస్యస్పదంగా ఉందన్నారు. సభను కట్టడి చేయడంలో స్పీకర్ తీరు అభినందనీయంగా ఉందని మాణిక్యవరప్రసాద్ అన్నారు.