మంత్రి పదవులకోసం కేసీఆర్, బొజ్జల చంద్రబాబుపై తిరుగుబాటు, అడ్డుపడ్డా: సోమిరెడ్డి సంచలనం
హైదరాబాద్: ఎన్టీఆర్ నే పదవి నుండి దించేశాం. చంద్రబాబునాయుడు ఎంత అని కెసిఆర్ అన్నాడని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి గుర్తు చేసుకొన్నారు.అయితే ఎన్టీఆర్ ను పదవి నుండి దించేసిన సందర్భం వేరు, మంత్రి పదవుల కోసం తిరుగుబాటు చేయడం వేరని తాను చెప్పానని చెప్పారు.
1999లో చంద్రబాబునాయుడు రెండో దఫా ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయనపై తిరుగుబాటు ప్రయత్నం జరిగిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె కార్యక్రమంలో రాధాకృష్ణ చేసిన ఇంటర్వ్యూలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన విషయలను వెల్లడించారు.
1999లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రయోగాలు చేశారని చెప్పారు.అయితే ఈ సమయంలో మంత్రిపదవులు రాని కొందరు సీనియర్ నాయకులు మంత్రిపదవి కోసం బాబుపై తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు.
అయితే ఈ తిరుగుబాటు కోసం నాలుగైదు సమావేశాలు నిర్వహించారని ఆయన చెప్పారు.అయితే ఈ సమావేశానికి హాజరైన తాను తన అభిప్రాయాలను నిర్మోహామాటంగా చెప్పానని ఆయన గుర్తు చేసుకొన్నారు.అయితే తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టిన తర్వాత పరిస్థితిలో మార్పులు వచ్చాయన్నారు.
1999లో బాబుపై తిరుగుబాటుకు ప్రయత్నాలు సాగాయి
1996 లో మా బ్యాచ్ పొలిట్ బ్యూరోలో, టీడీఎల్పీలో చాలా క్రియాశీలకంగా ఉండేది. చంద్రబాబునాయుడు నోటీ నుండి మాట బయటకు రాకముందే రంగంలోకి దిగేవాళ్ళమన్నారు సోమిరెడ్డి.36 మంది మంత్రుల్లో 35 మంది మంత్రులు 1999 ఎన్నికల్లో గెలిచినట్టు ఆయన ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో చంద్రబాబునాయుడు విపరీతమైన ప్రయోగాలు చేశారని ఆయన గుర్తు చేశారు. చిత్తూరు నుండి అందరినీ పక్కనపెట్టారని చెప్పారు. మంత్రిపదవులు రాకపోవడంతో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కేసీఆర్ సీరియస్ గా తీసుకొన్నారని చెప్పారు.ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కూడ సహాకరించేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఈ మేరకు కేసిఆర్ కు రాయబారం వచ్చిన విషయాన్ని ఆయన ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకొన్నారు.చంద్రబాబునాయుడుపై తిరుగుబాటుకు ప్రయత్నాలు జరిగాయన్నారు.
ఎన్టీఆర్ ను దించాం, చంద్రబాబు లెక్కా?
ఆనాడు కాంగ్రెస్ పార్టీకి 91 మంది సభ్యులున్నారని చెప్పారు.కెసిఆర్ రెండు మూడు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలను తాను దూరంగా ఉండాలని అనుకొన్నట్టు చెప్పారు. ఒక్కరోజు తనకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నుండి ఫోన్ చేసినట్టు చెప్పారు.ఎవరెవరున్నారని తాను అడిగాననన్నారు. అక్కడికి వెళ్ళే సరికి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి సమయం నుండి రాజకీయాలు చేస్తున్నావు. కేసీఆర్ మేథావి మీరిద్దరూ ఏది చెబితే అదే చేస్తామని బొజ్జల అన్నాడని చెప్పారు. కేసీఆర్ 40 నిమిషాలపాటు మాట్లాడారని సోమిరెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ ను దించేసినప్పుడు చంద్రబాబు ఎంత అని కేసిఆర్ అన్నారని సోమిరెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
నాదెండ్ల భాస్కర్ రావు మాదిరిగా కాకూడదన్నాను
కానీ, తాను కేసీఆర్ తో విభేదించినట్టుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. 60 మంది ఎమ్మెల్యేలు మనతో వచ్చినా, వైఎస్ 91 మందితో మద్దతిచ్చినా ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ముద్ర వేసుకోవాల్సిందేనని తాను చెప్పానన్నారు. తనకు ఇది ఇష్టం లేదన్నారు. ఎన్టీఆర్ విషయంలో లక్ష్మీపార్వతి వల్ల పార్టీకి జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోవడానికి , పార్టీని కాపాడుకోవడానికి ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మంత్రి పదవి రాకపోతే తిరుగుబాటు చేయడానికి, ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేయడానికి చాలా తేడా ఉంటుందని చెప్పారు.దీంతో అందరూ డల్ అయిపోయారని చెప్పారు. తర్వాత వారానికే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చంద్రబాబుతో కలిసి పనిచేశారని చెప్పారు. కేసీఆర్ కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారని చెప్పారు.కేసీఆర్ తో మంచి అటాచ్ మెంట్ ఉండేదన్నారు. తుమ్మల నాగేశ్వర్ రావు, మండవ వెంకటేశ్వర్ రావు , బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనను తమ్ముడిలా చూసుకొనేవారని చెప్పారు.
బొజ్జల ఎందుకు తిట్టారంటే?
1999 లో రాజ్ భవన్ లో ప్రమాణస్వీకార కార్యక్రమానికి తాను వెళ్ళాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనకు ఫోన్ వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్ళి వస్తున్నానంటే బొజ్జల తిట్టాడని ఆయన చెప్పారు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మంత్రి పదవులు రాలేదు
1995 లో వైస్రాయ్ ఘటన జరిగిన తర్వాత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు.అయితే బాబు ముఖ్యమంత్రి కాగానే తమను మంత్రివర్గంలోకి తీసుకోలేదన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.అయితే ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకోలేదో చంద్రబాబునాయుడు వివరించారని చెప్పారు.1996 లోఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. చాలా మంది మంత్రులుగా ఉన్న వారిని ఎంపీలుగా పోటీచేయనున్నట్టు చెప్పారు.ఆ తర్వాత మంత్రులనే ఎంపీలుగా పంపారు. 1996 లో బొజ్జల, కేసీఆర్ తనకు మంత్రి పదవులు వచ్చాయన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
కుటుంబనేపథ్యం నుండి రాజకీయాల్లోకి
మా పెదనాన్న స్వాతంత్ర్యపోరాట సమయంలో జైలుకు వెళ్ళారు. మా నాన్న కాంగ్రెస్ వ్యతిరేకి. ఆ తర్వాత ఆనం కుటుంబానికి వ్యతిరేకిగా మారారు. 1958 వరకు మా కుటుంబానికి ఆనం కుటుంబానికి చాలా సాన్నిహిత్యం ఉండేది. తర్వాత ఏదో విరోధం వచ్చింది. మా నాన్న చాలా మొండిగా వ్యవహరించేవారు. అప్పటి నుండి జిల్లాలో ఆనం వ్యతిరేకవర్గం నెల్లూరులోని మాకున్న శ్రీనివాస థియేటర్ లో సమావేశమయ్యేది. 1983 లో మానాన్న చనిపోయిన తర్వాత మేమంతా శీనయ్య మామతో ఉంటూ వచ్చినట్టు ఆయన చెప్పారు.
ఆనం కుటుంబంతో విభేదాలు లేవు
ఆనం కటుంబంతో ప్రస్తుతం విభేదాలు లేవన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జిల్లాలో రాజకీయ శత్రువులే తప్ప వ్యక్తిగత శత్రువులు లేరన్నారు. 1991 లో నేదురుమల్లి జనార్థన్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు నేను వీధుల్లో పోరాటం చేసేవాడిని. మో రెండో మామ కొడుకు నేదురుమల్లికి దగ్గరగా ఉండేవాడు. అప్పుడు ఆయన సోమిరెడ్డి ఫైటర్ అనేవాడు. రామనారాయణరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కూడ సోమిరెడ్డికి ఇరిగేషన్ మీద మంచి పట్టుందని చెప్పేవారని ఆయన గుర్తు చేశారు.
ప్రసన్నకుమార్ రెడ్డతో విబేధాలు ఎందుకు వచ్చాయి?
1993 లో శీనయ్య మామ చనిపోయారు. ఉప ఎన్నికలు వచ్చాయి, ఎమ్మెల్యేలు ఎవరైనా చనిపోతే వారి కటుంబంలో ఉండేవారికి సీటు ఇవ్వడం ఆనవాయితీ. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి మాత్రం ప్రసన్నకుమార్ రెడ్డికి టిక్కెట్టు ఇవ్వనని చెప్పాడు. టీడీపి నుండి పోటీచేస్తానంటే తాను మాట్లాడుతానని ప్రసన్నకుమార్ రెడ్డికి చెప్పానన్నారు. తాను రాయచోటీలో చంద్రబాబుతో విషయం చెప్పానన్నారు. నేరుగా ఎన్టీఆర్ తో మాట్లాడమని చెప్పారు. నేను ఎన్టీఆర్ తో చెబితే ఆయన ససేమిరా అన్నారు. శ్రీనివాసులురెడ్డిని పార్టీ గౌరవిస్తే, ఆయన తనను రోడ్డున నిలబెట్టాడని ఎన్టీఆర్ నిప్పులు చెరిగారని ఆయన గుర్తు చేశారు.చివరకు ఎన్టీఆర్ ను ఒప్పించాను.ప్రసన్నకుమార్ రెడ్డిని పోటీచేయించి గెలిపించినట్టు చెప్పారు. 1994లో ప్రసన్నకుమార్ రెడ్డి మంత్రి అయ్యాడన్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబునాయుడు సహాయం చేశాడని ఆయన గుర్తు చేశారు. 2009 లో ఎన్నికైన తర్వాత చంద్రబాబును ఇష్టమొచ్చినట్టు తిట్టారని చెప్పారు. గెలిచిన తర్వాత అలా మారిపోతే నాకు బాధేసింది. అంతేకాదు 2009లో తన కూతురు పెళ్ళికి కూడు ప్రసన్న రాలేదన్నారు.
జగన్ ను దెబ్బతీసేందుకే రెడ్డి సామాజిక వర్గానికి క్యాబినెట్ లో ఎక్కువ ప్రాధాన్యత
2014 ఎన్నికల సమయంలో నామినేషన్లకు ముందే మార్పులు వచ్చాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు టిడిపిలోకి వచ్చారు. ప్రజల్లో కూడ మార్పులు వచ్చాయి. జగన్ పై కేసులు ఆయన ప్రవర్తనను చూసి రెడ్డి సామాజిక వర్గానికి తలవంపులు తెచ్చారని భావనలో ఆ సామాజికవర్గం ఉందన్నారు సోమిరెడ్డి.
మంత్రి పదవి వస్తోందని ముందే ఊహించాను
ముఖ్యమంత్రి వద్దకు తాను కేఈ కృష్ణమూర్తి ఒకేసారి వెళ్ళినట్టు చెప్పారు. మంత్రి పదవి కోసం ఒత్తిడి చేయకూడదని చెప్పారు. ఇవ్వను అని మాత్రం చెప్పలేదు. కానీ, చంద్రబాబునాయుడికి ఓ అలవాటు ఉంది. ఎవరికైనా పదవి ఇవ్వను అని చెప్పారంటే వాళ్ళకు పదవి ఇచ్చే అవకాశం ఎక్కువ. కేబినేట్ విస్తరణకు రెండు రోజుల ముందు సీఎంను కలిసినప్పుడు ఆయన మాటల ద్వారా మంత్రి పదవి ఇస్తారని అర్థమైంది. బయటకు వచ్చిన వెంటనే నా భార్యకు ఫోన్ చేసి మంత్రి పదవి వస్తోందని చెప్పేశానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.