'వైయస్ జగన్వన్నీ రాంగ్ స్టెప్స్, పిల్లకుంకతో చంద్రబాబు హత్యకు ప్లాన్ చేస్తాడా?'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై ఏపీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం తీవ్రంగా స్పందించారు. నిదితుడు శ్రీనివాసరావు వైయస్ జగన్ అభిమాని అని తేలిందన్నారు.
సానుభూతి కోసమే దాడి జరిగినట్లుగా చెబుతున్నారని అన్నారు. వారు చేసే డ్రామాలు చూస్తుంటే నవ్వు వస్తోందని చెప్పారు. వైసీపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. ఏపీని చంద్రబాబు కాకుండా గవర్నర్ పాలించాలా అన్నారు. జగన్కు విశాఖలో ప్రాథమిక చికిత్స చేయించుకునేందుకు భయపడుతున్నారా అన్నారు.
ఆపరేషన్ గరుడలో చెప్పినట్లే, ప్రభుత్వాన్ని కూల్చాలనే: గవర్నర్పై బాబు తీవ్ర విమర్శలు
జగన్ రాంగ్ స్టెప్స్
వైసీపీ, జగన్ వేసిన స్టెప్స్ అన్నీ రాంగ్ స్టెప్స్ అని సోమిరెడ్డి అన్నారు. మీ డ్రామాలు అన్నీ తెలిసిపోయాయని చెప్పారు. ఇప్పటికైనా వైసీపీ, కేంద్రం డ్రామాలు ఆపాలని సూచించారు. ప్రజాస్వామ్య రాజకీయాలు చేయాలని, ఫ్యాక్షన్ రాజకీయాలు చేయవద్దని జగన్కు సూచించారు. ఒక గవర్నర్ 12 ఏళ్లుగా ఒకేచోట ఉన్న పరిస్థితి ఎప్పుడైనా ఉందా అన్నారు.
అర సెంటీమీటర్ గాయానికి గవర్నర్ విచారణ చేయాలా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన దాడి నేపథ్యంలో అర సెంటిమీటర్ గాయానికి గవర్నర్ విచారణ చెయ్యాలా అని సోమిరెడ్డి చంద్రమోహన్ ప్రశ్నించారు. గవర్నర్ నరసింహన్ పన్నెండేళ్లుగా ఇక్కడ ఉండటం ఏమిటని ప్రశ్నించారు. నరసింహన్ పైన కేంద్ర ప్రభుత్వానికి అంత ప్రేమ ఎందుకో చెప్పాలని నిలదీశారు.
కుట్లు వేయించుకునేందుకు హైదరాబాద్ వెళ్లాలా?
జగన్ పైన దాడి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాటా అనడం లేదని, ఎందుకో చెప్పాలని సోమిరెడ్డి నిలదీశారు. విశాఖపట్నంలో కుట్లు వేసే డాక్టర్లు లేరని, జగన్ హైదరాబాద్కు వెళ్లారా, అందుకు అక్కడి వరకు వెళ్లాలా అని ప్రశ్నించారు.
చంద్రబాబు పిల్ల కుంకతో హత్యకు ప్లాన్ చేస్తాడా?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిల్ల కుంకతో హత్యకు ప్లాన్ చేస్తాడా అని సోమిరెడ్డి అన్నారు. తాము నిజంగా ప్లాన్ చేస్తే ఇలా గిచ్చుకోవడాలు, గుచ్చుకోవడాలు ఉండవన్నారు. రాజారెడ్డి, వైయస్, జగన్ తరహాలోనే ఉంటుందని, అలాంటి చెడు ఆలోచనలు తమకు లేవన్నారు. జగన్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే చీపురుపుల్ల కూడా గుచ్చుకోలేదని చెప్పారు. కేంద్ర పరిధిలోని విమానాశ్రయంలోకి వెళ్లగానే జగన్ పైన దాడి జరిగిందని చెప్పారు. కేంద్రం అమలు చేసిన డ్రామాలో సీఐఎస్ఎఫ్ కూడా సహకరించిందా అని ప్రశ్నించారు. డీజీపీ పైన వైసీపీ అర్థంలేని ఆరోపణలు చేస్తోందన్నారు.
జగన్ మా ఇంటి నుంచి వచ్చే టీ తాగేవారు
కాగా, జగన్ పైన దాడి ఘటనపై వైసీపీ నేత, జగన్ సన్నిహితుడైన మాజీ కార్పోరేటర్ శ్రీధర్ మాట్లాడుతూ... ఇది వరకు జగన్ ఎప్పుడు విమానాశ్రయానికి వచ్చినా తన ఇంటి నుంచి తెచ్చిందే తాగేవారని చెప్పారు. దాడి జరిగిన సమయంలో ఆయన వైసీపీ అధినేత పక్కనే ఉన్నారు. విమానాశ్రయానికి సమీపంలోని తన ఇంటి నుంచి ప్లాస్క్లో టీ తెచ్చేవాడినని చెప్పారు. గత వారం టీ బయటి నుంచి వద్దని, లోపల ఉన్నదే తాగాలని ఎయిర్ పోర్టు సిబ్బంది చెప్పారని అన్నారు.
జగన్ అంగీకరిస్తే దాడి చేశాడు
ఇదే అంశాన్ని రెస్టారెంటులో పని చేస్తున్న శ్రీనివాస రావు అవకాశంగా మలుచుకున్నాడని చెప్పారు. జగన్తో మాట్లాడేటప్పుడు ఓ మంచినీటి సీసాను వెంట తెచ్చాడని, సప్లై చేస్తున్న వ్యక్తిగా నటించాడని చెప్పారు. సెల్ఫీ తీసుకుంటే జగన్ అంగీకరించాడని, ఇలా ఘాతుకానికి పాల్పడతాడని ఊహించలేదని చెప్పారు. ఆ రెస్టారెంటు టీడీపీ నేతకు సంబంధించినదని, ఆ పార్టీ వారే ఈ పని చేసి ఉంటారని చెప్పారు.