జగన్తో విసిగిపోయారు, అందుకే ఈ తీర్పులు: సోమిరెడ్డి సెటైర్లు
ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన, అతని బాధ్యతారహిత మాటలు వింటూ ప్రజలు విసిగిపోయారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
విజయవాడ: ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన, అతని బాధ్యతారహిత మాటలు వింటూ ప్రజలు విసిగిపోయారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 30ఏళ్ల తర్వాత కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం పట్ల సోమిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రతిపక్ష నేతగా నిర్మాణాత్మక పాత్ర పోషించలేకపోయారని, అతనికి రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదని గుర్తిస్తూ ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని అన్నారు. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ పురపాలక ఎన్నికలే 2019 అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం అంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల నుంచి వెనక్కి పోవద్దని అన్నారు.
రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా.. కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల సహకారంతో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని మంత్రి సోమిరెడ్డి వివరించారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో చంద్రబాబు పడిన కష్టాన్ని ప్రజలు గుర్తించి ఓటు రూపంలో విజయాన్ని కట్టబెట్టారని తెలిపారు.
కాగా, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 48 డివిజన్లకు గానూ టీడీపీ కూటమి(టీడీపీకి 32, బీజేపీకి3)కి 35 స్థానాల్లో గెలుపొందగా, వైసీపీ 10 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు.