షర్మిళను కూడా జగన్ రోడ్డుపైకి లాగారు: పవన్ కళ్యాణ్ను పేరు ప్రస్తావించిన సోమిరెడ్డి
అమరావతి: సోషల్ మీడియాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై జరుగుతున్న ప్రచారాన్ని తాము ఖండిస్తున్నామని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం అన్నారు. కుటుంబాల మీద దాడి జరిగితే అది ఎవరు చేసినా తప్పేనని అన్నారు.
అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఒకలా, షర్మిల విషయంలో మరొకలా వ్యవహరించడం సరికాదని సోమిరెడ్డి అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తల్లిపై, పవన్ పెళ్లిళ్లపై విపక్షాలు మాట్లాడాయి. దీనిని ఉద్దేశించి సోమిరెడ్డి అన్నారు. సోషల్ మీడియా వింగ్లను పెట్టుకొని పోస్టులు పెట్టింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు.
జగన్కు ఎవరు సలహాలు ఇస్తున్నారో అర్థం కావట్లేదు
ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం జగన్కు తగదని సోమిరెడ్డి అన్నారు. టీడీపీ మహిళలపై పెట్టిన అసభ్య పోస్టులను వైసీపీ వారు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. తప్పుడు పోస్టులను ఎవరు పెట్టినా తెలుగుదేశం పార్టీ దానిని ఆమోదించదని చెప్పారు. రాజకీయం, ముఖ్యమంత్రి పదవి కోసం చివరకు షర్మిళను కూడా రోడ్డు పైకి తీసుకు వచ్చారన్నారు. రాజకీయాలు పక్కన పెడితే మీ (జగన్) నిర్ణయాలు చాలా ఘోరమైనవని చెప్పారు. సభ్య సమాజం ఆమోదించదని చెప్పారు. జగన్కు ఎవరు సలహాలు ఇస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. తాము ఆ స్థాయికి దిగజారలేదని, పిచ్చి రాజకీయాలు చేసి అధికారంలో కొనసాగాలని అనుకోవడం లేదన్నారు.
జగన్, షర్మిలలకు నమ్మకం లేదా?
ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని షర్మిల చెప్పడం ఏమిటని సోమిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులపై తప్ప జగన్కు ఎవరి పైన నమ్మకం లేదా అన్నారు. ఎన్నికలకు ముందు జగన్ ఆంధ్రప్రదేశ్లో గృహప్రవేశానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము ఎన్డీయేలో ఉంటూ ఏపీ ప్రయోజనాల కోసం మిత్రపక్షం బీజేపీతో పోరాడామని, కానీ జగన్ ఏం చేశారని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఈ నాలుగేళ్ల పాలనలో ఏపీని ఎన్నో రంగాల్లో ముందుంచామని చెప్పారు.
చంద్రబాబు గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు
కేసీఆర్ పైన కూడా సోమిరెడ్డి నిప్పులు చెరిగారు. తాము లోటు బడ్జెట్లో ఉంటే ఎన్నో చేశామని, మీరు మాత్రం అలా చేయలేకపోయారన్నారు. పాలనలో మీకు, మాకు తేడా ఉందన్నారు. పింఛన్లు ఎంతో పెంచిన చంద్రబాబు ఇంకా ఎంతో ఇవ్వాలనుకున్నారని, కానీ తమకు ఓ హైదరాబాద్ వంటి నగరం లేదని చెప్పారు. తాము జగన్ను చూసి కాపీ కొట్టడం లేదని చెప్పారు. చంద్రబాబు మళ్లీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణను చూసి మనం ఏం నేర్చుకోవాలన్నారు.