సిగ్గులేదా: చిరంజీవి సహా కాంగ్రెస్ నేతలకు సోమిరెడ్డి ప్రశ్న
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతల పైన బుధవారం నాడు మహానాడులో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న పార్టీని రద్దు చేయాలని కోరడానికి చిరంజీవి, బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డి తదితరులు సిగ్గులేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీది ఓ డ్రామా కంపెనీ అన్నారు. టీడీపీనీ రద్దు చేయమంటారా అని నిలదీశారు. వారి తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందన్నారు. ప్రజలు ఎన్నుకుంటే, అధికారంలో ఉన్న పార్టీని రద్దు చేయమని చెప్పడమేమిటన్నారు.
మీ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ దాదాపు రెండు నెలలు కనబడకుండా పోయారని, అధికారం పోగానే ఆయన కనిపించకుండా పోయారన్నారు. ఆయన ఎక్కడికి పోయారో.. దేశానికి, పత్రికలకు అర్థం కాలేదన్నారు. చివరకు సోనియా గాంధీని అడిగితే సెలవు తీసుకున్నారని చెప్పారన్నారు.
ఓ రాజకీయ నాయకుడు సెలవు తీసుకోవడం ఎప్పుడైనా చూశారా అని ఎద్దేవా చేశారు. రాహుల్ దాదాపు రెండు నెలలు ఎక్కడికి వెళ్లారు, ఎవరితో వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. ఆయన వైయస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పైన కూడా ధ్వజమెత్తారు.
కచ్చితంగా అధికారంలోకి వస్తాం: చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలో తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంతకుముందు చెప్పారు. బాబ్లీ విషయంలో తాను లాఠీ దెబ్బలు తిన్నానని, జైలుకు వెళ్లానని చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చేసింది, చేసేది టీడీపీయే అన్నారు.
అన్ని పార్టీల కంటే చురుకైన కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని చెప్పారు. పథకాల అమలులో నేతలు, కార్యకర్తల భాగస్వామ్యం ఉండాలన్నారు. పని చేసే వారికే పార్టీలో పదవులు లభిస్తాయని చెప్పారు. నాయకుల చుట్టూ తిరిగే వారికి పదవులు రావన్నారు.
పార్టీని నమ్ముకొని జెండా మోసిన కార్యకర్తలను విస్మరించమని చెప్పారు. పార్టీ కోసం 24 గంటలూ పనిచేసే కార్యకర్తలు చాలామంది ఉన్నారని, వారికి ఇబ్బందులు ఉంటే ఆదుకుంటామని చెప్పారు. కార్యకర్తల సంక్షేమం తన ధ్యేయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలే తమ అజెండా అన్నారు.