'జగన్! ఇదేం వైయస్ హయామా? కలెక్టర్ భుజంపై చేయివేసి బెదిరింపా'
ఓ కలెక్టర్ భుజం పైన చేయి వేసి జగన్ బెదిరించడం ఏమిటని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం నాడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అమరావతి: ఓ కలెక్టర్ భుజం పైన చేయి వేసి జగన్ బెదిరించడం ఏమిటని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం నాడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
బెదిరింపులకు వైయస్ హయాం కాదు
నిన్న విశాఖలో విమానాశ్రయ అధికారులను జగన్ బెదిరించారని, ఇప్పుడు జిల్లా కలెక్టర్ను జైలుకు పంపుతానని హెచ్చరించాడని, అలా బెదిరించడానికి ఇదేం వైయస్ రాజశేఖర రెడ్డి హయాం కాదని సోమిరెడ్డి మండిపడ్డారు.
వైసిపి నేతలు ఇలాగే..
ఓ కలెక్టర్ను జగన్ తిడతారా, ప్రశ్నిస్తారా, బెదిరిస్తారా అని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పైన వైసిపి నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
లీడరా.. విలనా
అసలు జగన్ ప్రతిపక్ష నాయకుడా లేక ప్రతి నాయకుడా (విలన్) అని సోమిరెడ్డి నిలదీశారు. జిల్లా కలెక్టర్ కుడి భుజం పైన చేయి వేసి బెదిరించడం ఏమిటన్నారు. ఆసుపత్రిలో జగన్ తీరు అభ్యంతరకరమన్నారు.
రౌడీల లీడరా.. రోజాపై చర్యలు తీసుకోవాలి
చుట్టూ ఉండే రౌడీ గ్యాంగుకు జగన్ లీడర్లా కనిపిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రోజాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం కాపీలను అందరికీ పంచరని, కావాలంటే అడిగి తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడిన తీరు చూడమని సోమిరెడ్డి అందుకు సంబంధించిన వీడియోను మీడియాకు చూపించారు.
పేపర్ లాక్కొని..
విశాఖలో అడ్డుకుంటే సీఎంను తాకుతారా అని జగన్ బెదిరించారని సోమిరెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు కలెక్టర్ చేతిలో పేపర్ లాక్కొని బెదిరిస్తే ఎందుకు ఊరుకుంటారన్నారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్కు అదే అలవాటైపోయిందని, ఉద్యోగుల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారన్నారు.
జగన్కు శిక్ష పడాల్సిందే
అధికారులపై దురుసుగా ప్రవర్తించిన జగన్పై చర్యలు తీసుకోవాల్సిందేనని, చట్టానికి ఎవరూ అతీతులు కారని, జగన్కు శిక్ష పడాల్సిందేనన్నారు. చట్టానికి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. అన్నాడీఎంకే అధినేత్రి శశికళ వ్యవహారం చూసి జగన్కు భయం పట్టుకుందన్నారు.