జగన్కు రివర్స్ షాక్.. బొత్స నాశనం చేస్తుంటే మాట్లాడరేం: సోమిరెడ్డి, విష్ణు మాటేంటి?
నెల్లూరు: కల్తీ మద్యం బాధితులను పరామర్శించి, టిడిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మద్యం ఏరులై పారిందని ఆగ్రహించారు. తనకు అయిదు జిల్లాల్లో మద్యం వ్యాపారం ఉందని వైసిపి నేత బొత్స సత్యనారాయణ గతంలో స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు.
ఐదు జిల్లాల్లో వ్యాపారం చేస్తూ నాశనం చేస్తున్న బొత్సను వైసిపిలో ఎలా కొనసాగిస్తారో చెప్పాలని సవాల్ చేశారు. మద్యం మృతుల కుటుంబాలకు వైయస్ రాజశేఖర రెడ్డిహయాంలో ఏమైనా పరిహారం ఇచ్చారా చెప్పాలని విమర్శించారు.
వైసిపిలో ఉన్న నేతలు చాలామంది కల్తీ మద్యం వ్యాపారులేనని ఆరోపించారు. ఎన్నికల్లో కల్తీ మద్యం పంపిణీ చేశారన్నారు. జగన్ వ్యాఖ్యలు పిల్లల చేష్టల్లా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు బార్లో ఘటన జరిగితే జగన్ ఆయన పైన ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: బాబు
పోలవరం ప్రాజెక్టుని 2018 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటకు వెళ్లే ముందు ఆయన విజయవాడలోని తన నివాసం నుంచి నీరు - ప్రగతిపై మంత్రులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో జలవనరుల స్థితిగతులపై నీరు-ప్రగతి పేరుతో ఈనెల 1న సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టుల పనుల పురోగతి, కరవు నివారణ చర్యలు, నీటికుంటల తవ్వకం వంటి అంశాలను అందులో పొందుపర్చారు.
దీనిపై చర్చ జరగాలన్నారు. ఆ మేరకు ఇవాళ సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టిసీమ ఫలితాలు తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఇదే స్ఫూర్తితో పనిచేసి కరవు రహిత ఏపీ కోసం శ్రమిద్దామన్నారు. ప్రతి నెలా నీరు-ప్రగతి కార్యక్రమంపై జిల్లా స్థాయిల్లో సమీక్షించుకోవాలని అధికారులు, మంత్రులను ఆదేశించారు.