జగన్! నీ తండ్రిని అడగలేదే: సోమిరెడ్డి, రత్నాచల్పై కీలక ఆధారం.. నెట్లో వీడియో!
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తలతిక్కతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం నాడు నిప్పులు చెరిగారు.
జగన్, ఆయన పార్టీ ప్రభుత్వం పైన బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అవినీతిపరుడైన జగన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. వైసిపి పరామర్శ పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పైన జగన్ పైన ఉన్నట్లుగా సీబీఐ, ఈడీ కేసులు లేవని దుమ్మెత్తిపోశారు. ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడిగేందుకు చంద్రబాబు ఏమాత్రం భయపడటం లేదని చెప్పారు. జగన్ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
చంద్రబాబు పైన జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి వేసిన ఒక్క కేసును కూడా నిరూపించలేకపోయారన్నారు. కాపులను బీసీలలో చేర్చాలని వైయస్ జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ఎందుకు అడగలేకపోయారన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిందన్నారు. మరి వైయస్ హయాంలో ఎందుకు చేర్చలేదన్నారు.
తుని ఘటనపై కీలక ఆధారం!
కాపు గర్జన నేపథ్యంలో జరిగిన తుని ఘటన పైన పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలులోని ఓ ప్రయాణీకుడు ఘటనను వీడియో తీసి నెట్లో పెట్టాడు. దాని ఆధారంగా కూడా పోలీసులు విచారిస్తున్నారు. దాడి దృశ్యాలను వీడియో తీసి నెట్లో పెట్టాడు. ఈ వీడియో కీలక ఆధారమని తెలుస్తోంది. ముసుగుతో ఉన్న వారు ఎవరో తేలాల్సి ఉంది.