మరో ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు...చంద్రబాబుకు మరింత తలనొప్పులా!
ఇప్పటికే విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నఆధిపత్య పోరు టిడిపి పరువును అనేక సందర్భాల్లో రచ్చకీడ్చిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ఇప్పుడు ఒకే జిల్లాకు చెందిన మరో ఇద్దరు మంత్రుల మధ్య ఇదే తరహాలో పోటీ పడుతుండటంతో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు పుట్టుకొస్తున్నాయి.
వీరి మధ్య ఆధిపత్య పోరు శృతిమించుతుండటంతో వాటి పర్యవసానాలు తట్టుకోలేని ఆ జిల్లా కలెక్టర్.. ఏకంగా తనను బదిలీ చేయాలని సీఎంనే కోరారంటున్నారు...దీనిని బట్టే అక్కడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చంటున్నారు స్థానిక టిడిపి నేతలు...ఇంతకూ వీరిద్దరూ ఎవరంటే..వీరిలో ఒకరు చంద్రబాబుకు ఆప్తుడు మంత్రి నారాయణ కాగా మరొకరు అనుంగు అనుచరుడు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి!!
మంత్రుల మధ్య పోరు...చంద్రబాబుకు తాజా తలనొప్పి...
నారాయణ,సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి...నెల్లూరు జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంత్రులు ఇప్పుడు చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారట. ఎవరికి వారు జిల్లాలో తమ ఆధిపత్యాన్నిచాటుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో వారి మధ్యలో అధికారుల పరిస్థితి అడకత్తెరెలో పోకచెక్కలా తయారవుతోందట. జిల్లాలో అధికారుల బదిలీలతో సహా ఏ వ్యవహారమైనా మాకు తెలియకుండా జరగడానికి వీల్లేదని, తమ కనుసన్నల్లోనే జరగాలని వీరిద్దరూ ఎవరికి వారు ఆర్డర్లు వేస్తుండటంతో అధికారగణం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారట.
సోమిరెడ్డి మంత్రి కాకముందు...నారాయణ దే హవా...
సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి ఆ మధ్యకాలంలో మంత్రి పదవి రాకముందు వరకు నెల్లూరులో మంత్రి నారాయణదే పూర్తి హవా. చంద్రబాబుకు బాగా సన్నిహితులన్న పేరు ఉండటంతో అధికారులు, నాయకులు నారాయణ మాటకు అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు. ఆయన కూడా అలాగే అధికారులను,నాయకులను ఉరుకులు పరుగులు పెట్టించేవారు. అయితే ఆ తరువాత కొన్ని మీడియాల్లో నారాయణకు వ్యతిరేకంగా వార్తలు వస్తూండటం...అదే సమయంలో సోమిరెడ్డి మంత్రి అవడంతో క్రమంగా నారాయణ హవా తగ్గిపోతూవస్తోంది. ఇదే సరైన తరుణమనుకుంటూ నారాయణ వ్యతిరేకవర్గం మంత్రి సోమిరెడ్డి దగ్గర చేరడంతో ఇద్దరి మధ్య పోరు క్రమ తీవ్రరూపం దాల్చింది.
వీళ్లతో...కలెక్టర్ కూడా ఇబ్బంది పడ్డారా?...
నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మారుమూల గ్రామాలకు సైతం చేరేలా గట్టి కృషి చేశారు. అయితే జిల్లా మంత్రులు నారాయణ, సోమిరెడ్డిల వల్ల అధికారయంత్రాంగానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విషయాన్ని కలెక్టర్ ముత్యాలరాజు తెలుసుకున్నారు. మొన్నటివరకు ఒక్క మున్సిపల్ మంత్రి నారాయణ వల్లే కొన్ని ఇబ్బందులు ఎదురైతే ఇప్పుడు సోమిరెడ్డి చేరికతో ఈ ఇబ్బందులు రెట్టింపైనట్లు చెప్పుకుంటున్నారు. జిల్లాలో మాటా నెగ్గాలి...మా ఆదేశాలకే అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని ఇద్దరు మంత్రులు అనుకుంటుండటంతో అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఒక ఉద్యోగిని బదిలీ చేయాలన్నా.. మరొక ఉద్యోగిని తెచ్చుకోవాలన్నా...దానిపై ఇద్దరిదీ చెరో మాట కావడంతో ఉన్నతాధికారులు నానా అవస్థలు పడుతున్నారట.
దీంతో కలెక్టర్...తనను ట్రాన్స్ ఫర్ చేయమని...
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో పోటీ పడాల్సిన ఇద్దరు మంత్రులు ఇలా ఆధిపత్య పోరులో పోటీపడి అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు ఇద్దరూ వాపోతున్నారట. దీంతో ఈ సమస్యలతో విసిగిపోయిన జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబును కలిసి తన సమస్య గురించి వివరించారట. వీలైనంత త్వరగా తనను వేరే జిల్లాకు ట్రాన్స్ పర్ బదిలీ చేయాలని కోరారట. అంతే కాకుండా ఆ తరువాత ముఖ్య అధికారిని, సీఎంవో అధికారులను కూడా కలసి తన బదిలీకి సహకరించాల్సిందిగా కోరారని తెలిసింది. కలెక్టర్ ఇంతగా తన బదిలీ కోసం ప్రయత్నిస్తుండటంతో అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అధికారులు ఉసూరుమంటున్నారట. దీంతో ఇప్పటికే విశాఖ జిల్లాలో గంటా, అయ్యన్న పాత్రుడుల వ్యవహారమే పార్టీకి తలనొప్పి అనుకుంటే మళ్లీ వీళ్లిద్దరూ తయారయ్యారా?...అని పార్టీ వర్గాలే విసుక్కునేలా తయారైందట వీరి వ్యవహారం. మరి చంద్రబాబు వీరిని ఎలా కంట్రోల్ చేస్తారో వేచిచూడాలి..