నారాయణకు నెల్లూరు అర్బన్, సోమిరెడ్డికి సర్వేపల్లిని ఖరారు చేసిన చంద్రబాబు
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా, గురువారం నెల్లూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పలు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఎంపిక చేశారు.
సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు అర్బన్ నియోజకవర్గాన్ని మంత్రి నారాయణకు ఖరారు చేశారు. శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డితో మాట్లాడారు. ఈ స్థానంపై నిర్ణయాన్ని పెండింగ్లో ఉంచారు. నెల్లూరు గ్రామీణం ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోవూరు స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే పొలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఖరారు చేశారు.
తిరుపతి పార్లమెంటు పరిధిలోని అయిదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన సమీక్షను శుక్రవారానికి వాయిదా వేశారు. తిరుపతి, సత్యవీడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి స్థానాలపై నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
మోడీకి చంద్రబాబు లేఖ
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ మోడీకి రాకను నిరసిస్తూ సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు, ప్రత్యేక హోదా సాధన ఉద్యమ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గురువారం ప్రధాని మోడీకి బహిరంగ లేఖ కూడా రాశారు.
రాష్ట్ర విభజన హామీలన్నీ నెరవేర్చాకే రాష్ట్రంలో అడుగు పెట్టాలని చంద్రబాబు అన్నారు. విభజన తర్వాత ఆస్తులు, అప్పుల పంపిణీలో ఏపీకి అన్యాయం చేశారన్నారు. అయిదేళ్లయినా విభజన గాయాలు మానలేదని చెప్పారు. పుండుపై కారం చల్లేలా ప్రధాని పర్యటనలు, వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. వట్టి చేతులతో ఏపీకి రావడం తలవంపులుగా లేదా అన్నారు. ప్రధాని పదవిలో ఉన్న మోడీ అన్ని అంశాలకూ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అయిదు కోట్ల మంది ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలన్నారు.
విశాఖ పర్యటనకు ఒకరోజు ముందు రైల్వే జోన్ ప్రకటన చేశారని చంద్రబాబు ఆక్షేపించారు. వాల్తేర్ డివిజన్ను విడదీని ఏపీ పట్ల మోడీ తన అక్కసును మరోసారి వెళ్లగక్కారన్నారు. డివిజన్, ఆర్ఆర్బీ లేకుండా జోన్ ఏర్పాటు ఎక్కడైనా ఉందా? ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తారా? అని ప్రశ్నించారు. కేంద్రం చేసిన అన్యాయాలు, మోసాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారన్నారు.