అఖిలప్రియకు బాబు షాక్: మోహన్ రెడ్డిని కలుపుకొని వెళ్ళాల్సింది, వైసీపీ నుండి టిడిపిలోకి
శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడిన తర్వాత టిడిపి నాయకత్వం ఆలోచనలు మారుతున్నాయి.
కర్నూల్: శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడిన తర్వాత టిడిపి నాయకత్వం ఆలోచనలు మారుతున్నాయి.ప్రస్తుతం కర్నూల్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న శిల్పా మోహన్ రెడ్డి చక్రపాణిరెడ్డి స్థానంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చక్రపాణిరెడ్డినే కొనసాగించాలని భావించినా మారిన పరిస్థితుల నేపథ్యంలో పార్టీ నాయకత్వం కూడ తన ఆలోచనలను మార్చుకొంటున్నట్టు కన్పిస్తోంది.మరో వైపు శిల్పా మోహన్ రెడ్డిని కలుపుకొని వెళ్తే బాగుండేదని మంత్రి అఖిలప్రియతో బాబు అన్నట్టు సమాచారం.అయితే ఈ విషయంలో తన తప్పేమీలేదని అఖిలప్రియ బాబుకు వివరణ ఇచ్చారని పార్టీవర్గాల్లో ప్రచారంలో ఉంది.
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో టిక్కెట్టు కేటాయింపు విషయంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నాన్చివేత వైఖరిని నిరసిస్తూ శిల్పామోహన్ రెడ్డి టిడిపిని వీడారు.
అయితే శిల్పామోహన్ రెడ్డి పార్టీని వీడడంతో పార్టీ నాయకత్వం నష్టనివారణ చర్యలను చేపట్టింది. మంత్రులు, పార్టీ నాయకులతో చంద్రబాబునాయుడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు. పార్టీ నుండి ఎవరూ కూడ వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాల్లో చోటుచేసుకొంటున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షపదవిని శిల్పా చక్రపాణిరెడ్డికి బదులుగా సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు కట్టబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
శిల్పా మోహన్ రెడ్డి వెంట ఎక్కువ సంఖ్యలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు, మంత్రులకు సూచించారు. బాబు సూచనలకు అనుగుణంగా పార్టీ నాయకులు రంగంలోకి దిగారు.
కర్నూల్ జిల్లా టిడిపి అధ్యక్ష పదవి సోమిశెట్టికి
కర్నూల్ జిల్లా టిడిపి అధ్యక్షపదవిని సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు కట్టబెట్టేందుకు పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.పార్టీ సంస్థాగత ఎన్నికల్లో బాగంగా చక్రపాణిరెడ్డిని కొనసాగించాలని భావించారు. అయితే మెజారిటీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేరున సూచించినట్టు పార్టీవర్గాల ద్వారా సమాచారం . అయితే శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడడంతో ఆయన సోమిశెట్టికే పార్టీపగ్గాలను అప్పగించాలని పార్టీ అధినేత భావిస్తున్నాని పార్టీవర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయమై పార్టీ నాయకత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే చక్రపాణిరెడ్డిని జిల్లా అధ్యక్షపదవిలో కొనసాగిస్తే పార్టీకి ప్రయోజనమనే అభిప్రాయాన్ని కొందరు పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
శిల్పామోహన్ రెడ్డిని కలుపుకొని వెళ్తే బాగుండేది
మంత్రిగా ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని వెళ్ళాలని మోహన్ రెడ్డిని కూడ కలుపుకొని వెళ్తే బాగుండేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అఖిలప్రియ దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం. నంద్యాలలో ఈ నెల 21వ, తేదిన పేదల పక్కా గృహ నిర్మాణ పథకానికి శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని అఖిలప్రియ ఆహ్వనించిన సందర్భంగా బాబు ఆమెతో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.
నాపై నెపం నెట్టడం సరికాదు
తన కారణంగానే శిల్పామోహన్ రెడ్డి పార్టీని వీడిపోయారనే ప్రచారాన్ని మంత్రి అఖిలప్రియ తప్పుబట్టారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకుగాను తాను నంద్యాల కేంద్రంగా పనిచేసినట్టు ఆమె చెప్పారు. అయితే తాను ఉద్దేశ్యపూర్వకంగానే శిల్పా మోహన్ రెడ్డిని తాను నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేశాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎవరో ప్రకటించలేదని ఆమె గుర్తుచేశారు. ఫలానావారే అభ్యర్థి అని తాను ఏనాడూ చెప్పలేదని ఆమె గుర్తుచేశారు. తన పనిని తాను చేసుకొంటూ వెళ్తున్నట్టు ఆమె చెప్పారు.నంద్యాలలో నెలరోజులుగా శిల్పా మోహన్ రెడ్డి లేని విషయాన్ని ఆమె గుర్తుచేశారు. అయితే ఈ విషయమై అఖిలప్రియ బాబుకు వివరణ ఇచ్చినట్టు సమాచారం.
వైసీపీ నుండి టిడిపిలోకి
శిల్పామోహన్ రెడ్డి టిడిపి నుండి వైసీపీలో చేరినందున వైసీపీ నుండి మరికొందరు నేతలు టిడిపిలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని మంత్రి అఖిలప్రియ చంద్రబాబుకు చెప్పారు. అయితే నంద్యాలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యక్రమం సందర్భంగా వైసీపీ నాయకులు టిడిపిలో చేరే కార్యక్రమం ఏర్పాటు చేసే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.