వెనక్కు తగ్గిన సోము వీర్రాజు - సీమ ప్రజలకు క్షమాపణలు : ఢిల్లీ పెద్దలు సీరియస్..!!
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఎట్టకేలకు వెనక్కు తగ్గారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. సీమ వాసులకు క్షమాపణ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న సోము వీర్రాజు ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలతో ఇరకాటంలో పడుతున్నారు. విజయవాడలో గత నెలలో జరిగిన సభలో చీప్ లిక్కర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తాయి. సోషల్ మీడియాలో జాతీయ నేతలు సైతం ఈ విధానం పైన ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలెవరూ వీర్రాజు వ్యాఖ్యలను కనీసం సమర్ధించేందుకు ముందుకు రాలేదు. వీటి పైన ఢిల్లీ బీజేపీ ముఖ్యులు సైతం ఆరా తీసినట్లుగా ప్రచారం సాగింది.
వీర్రాజు వ్యాఖ్యలతో కలకలం
ఇక, తాజాగా ఆయన హత్యలు చేసే కడప వాళ్లకు ఎయిర్పోర్టా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమయ్యాయి. దీని పైన సీమ వాసులు మండిపడ్డారు. కొందరు సోమును హెచ్చరించారు. దీంతో..వీర్రాజు మరోసారి ఒక వీడియో ద్వారా తన వ్యాఖ్యలను వక్రీకరించారని..తాను కేవలం వైఎస్ వివేకా హత్య పైనే మాట్లాడానని చెప్పుకొచ్చారు. అయినా, సీమ వాసుల్లో ఆగ్రహం తగ్గలేదు.
దీని పైన సోషల్ మీడియాలో సోమును నెటిజెట్లు తప్పు బడుతూ పోస్టింగులు పెట్టారు. వీర్రాజు వ్యాఖ్యల పైన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు తీవ్రంగా బాధిస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అన్నారు. సోము వీర్రాజు జిల్లాలో కనిపిస్తే ప్రజలు దాడిచేస్తారని హెచ్చరించారు.
సీమ నేతల సీరియస్..పార్టీ నేతల ఇరకాటం
తాను ప్రజాస్వామ్యంలో లేకపోయి ఉంటే.. సోము వీర్రాజు నాలుక కోసేవాడినని రాచమల్లు వ్యాఖ్యానించారు. మరి కొందరు సీమ నేతలు సోషల్ మీడియా ద్వారా సోము వీర్రాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఇదే సమయంలో కడప తో పాటుగా సీమ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారు.
పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న సమయంలో సోము వీర్రాజు సీమ ప్రాంతం పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా పార్టీకి నష్టం కలిగిస్తుందంటూ కొందరు ముఖ్య నేతలు అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లుగా పార్టీ వర్గాల సమాచారం. దీంతో..వెంటనే సోము వీర్రాజు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. రాయలసీమ ప్రజలను క్షమాపణలు కోరారు.
వ్యాఖ్యల ఉప సంహరణ...క్షమాపణలు
ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో..రాయలసీమ రతనాల సీమ ఈ పదం నా హృదయంలో పదిలం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు విమర్శించే విషయంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలను వెనక్కి తీసుకుంటున్నాను. ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను.
నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలనేదే బీజేపీ ఆలోచన..అంటూ సోమువీర్రాజు చెప్పుకొచ్చారు. దీని ద్వారా సీమ వాసులు శాంతించే అవకాశం కనిపిస్తోంది. కానీ, బీజేపీ ఏపీ చీఫ్ హోదాలో ఉంటూ ఇలా తన వ్యాఖ్యలతో తాను ఇబ్బంది పడటంతో పాటుగా పార్టీ ..పార్టీ నేతలు ఇరకాటంలో పడేలా సోము వ్యవహరించటం పైన పార్టీ అధినాయకత్వం సీరియస్ గా ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.