పొత్తులపై వీర్రాజు తేల్చేసారు - పవన్ కు లైన్ క్లియర్ : జగన్ కోరుకొనేది అదేనా..!!
ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. పొత్తుల అంశం పైన క్రమేణా క్లారిటీ వస్తోంది. వచ్చే ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా జగన్ ను ఓడించి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. జనసేన అధినేత పవన్ లక్ష్యం సైతం జగన్ ను ఓడించటమే. ఈ పరిస్థితుల్లోనే జనసేన ఆవిర్భావ సభలో పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పైన పోరాటం విషయంలో బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇస్తానని చెప్పిందని..త్వరగా ఇవ్వాలని కోరారు. అయితే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు మాత్రం చీలకుండా తాను బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేసారు.

సోము వీర్రాజు తేల్చి చెప్పినట్లేనా
దీని ద్వారా పార్టీల మధ్య పొత్తుల దిశగా.. జనసేన - టీడీపీ పొత్తు పైన ఆయన స్పష్టంగా సంకేతాలు ఇచ్చారనే చర్చ పార్టీల్లో వినిపిస్తోంది. వైసీపీ మాత్రం తాము ఒంటరి గానే పోటీ చేస్తామని.. టీడీపీ -జనసేన- బీజేపీ కలిసి పోటీ చేస్తాయని అంచనా వేస్తోంది. ఈ సమయంలోనే బీజేపీ ఏపీ చీఫ్ పొత్తుల అంశం పైన క్లారిటీ ఇచ్చారు. జనసేన పార్టీతో ఇప్పటికే తమకు పొత్తుందని, ప్రస్తుతానికి ఇంకెవరితోనూ కలిసి పని చేయాల్సిన అవసరం లేదని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అవసరమైతే ఒంటరిగానైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. దీని ద్వారా..జనసేనతో పొత్తు చెడితే..తాము మరొకరితో కలిసే అవకాశం లేదనే అంశాన్ని స్పష్టం చేసినట్లుగా కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ - టీడీపీ పొత్తుకు లైన్ క్లియర్
2014 తరహాలో బీజేపీ - టీడీపీ- జనసేన కలిసి పోటీ చేస్తారనే వైసీపీ నేతల అంచనాలకు భిన్నంగా వీర్రాజు ప్రకటన ఉంది. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ లక్ష్యంగా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆ సమయంలో కాంగ్రెస్ తోనూ జత కట్టారు. దీంతో..తిరిగి టీడీపీతో జత కట్టేది లేదని ఢిల్లీ బీజేపీ నేతలు స్ఫష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన ఆవిర్భావ సభలో పవన్ వ్యాఖ్యల తరువాత టీడీపీ నుంచి పొత్తుల పైన ఎటువంటి స్పందన లేదు. ఆచితూచి వ్యవహరించే ఆలోచనలో టీడీపీ ఉంది. జనసేన - బీజేపీ మధ్య పొత్తు ఉన్న తిరుపతి ఎన్నికల తరువాత రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగినట్లు ప్రచారం సాగుతోంది. ఆందోళనల్లో రెండు పార్టీలు ఎవరికి వారే అన్నట్లుగా కొనసాగుతున్నారు. తాజాగా విద్యుత్ ధరల పెంపు పైన చేసిన నిరసనల్లో రెండు పార్టీలు విడివిడిగానే పాల్గొన్నాయి. రోడ్ల అంశం పైన జనసేన ఒంటరిగానే నిరసనలు వ్యక్తం చేసింది.

పవన్ సైతం తేల్చేస్తారా
ఇక, ఈ నెల 5వ తేదీన జనసేన కీలక సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో భవిష్యత్ రాజకీయాల పైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, టీడీపీ సీనియర్లు సైతం జనసేనతో పాత్తు అవసరమని భావిస్తున్నారు. జనసేన కేడర్ సైతం బీజేపీ కంటే టీడీపీ బెటర్ అనే భావనలో ఉన్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఏపీలో ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ జగన్ గా పని చేస్తున్నాయి. అయితే, మరి కొంత కాలం తరువాతనే టీడీపీ - జనసేన మధ్య పొత్తు అంశం పైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ భవిష్యత్ లో జనసేనతో కొనసాగటం..టీడీపీతో కలవటానికి దూరం పాటిస్తే..పవన్ కోరుకున్న విధంగా జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా నివారించటం కష్టమే. అదే విధంగా.. ఇప్పుడు వైసీపీ సైతం వ్యూహాత్మకంగా టీడీపీ - జనసేన- బీజేపీ బంధం పైన ఎటాక్ ప్రారంభించింది.

వైసీపీ కోరుకుంటుంది అదేనా
ప్రభుత్వం తిరిగి ఏర్పాటు చేయటం ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్నా.. వ్యతిరేక ఓటు చీలలాంటే ఎన్ని పార్టీలో పోటీలో ఉంటే అంత వైసీపీకి ప్రయోజనం. పాజిటివ్ ఓటు ద్వారా తాము తిరిగి అధికారంలోకి వస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ, టీడీపీ మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెబుతున్నారు. అయితే, బీజేపీ - జనసేన పొత్తు కొనసాగింపు పైన స్పష్టత వచ్చిన తరువాత.. చంద్రబాబు రంగంలోకి దిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. అధికారం నిలబెట్టుకోవటం లక్ష్యంగా జగన్... తిరిగి అధికారంలోకి రావటమే టార్గెట్ గా చంద్రబాబు ... జగన్ మాత్రం సీఎంగా ఉండకూడదనే విధంగా పవన్ కల్యాణ్ నిర్ణయాలతో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరింత కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, తాజాగా సోము వీర్రాజు వ్యాఖ్యల పైన జనసేన నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది ఈ నెల 5వ తేదీన జరిగే జనసేన పార్టీ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.