కాకినాడలో మీ మోసం మరవలేం: సోము వీర్రాజు, ఓపికతో చంద్రబాబు: గంటా
అమరావతి: బీజేపీ - తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆదివారం బీజేపీ నేత సోము వీర్రాజు మరోసారి తెలుగుదేశం పైన విమర్శలు గుప్పించారు. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస రావులు కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
పవన్తో టీడీపీ ఎమ్మెల్యే గంటన్నరపాటు భేటీ, జైళ్లో పెట్టినా: బాబుకూ జనసేనాని ఝలక్!
కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో టీడీపీ చేసిన మోసాన్ని తాము మరిచిపోలేమని వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా తాము మిత్రధర్మం పాటిస్తున్నామన్న సీఎం చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. తాము కూడా మిత్రధర్మం పాటిస్తున్నామని చెప్పారు. టీడీపీయే ఆ ధర్మాన్ని విస్మరిస్తోందన్నారు.
కేంద్రం చేసిన అభివృద్ధిని టీడీపీ చేసినట్లుగా
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం చేసినట్లుగా చెప్పుకుంటున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో నిధుల సేకరణ, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నరేంద్ర మోడీ కృషితో రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీ అభివృద్ధి జరుగుతోందన్న విషయం గుర్తించాలన్నారు. నిధులు కేంద్రానివి అయితే, అవార్డులు రాష్ట్రానికా అన్నారు.
అంతా తామే చేసినట్లు చెప్పుకుంటున్నారు
కేంద్రం అభివృద్ధి చేస్తుంటే తానే చేశానని చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ గొప్పలు చెప్పుకుంటోందని సోము వీర్రాజు మండిపడ్డారు. కురుపాంలో ఈసారి బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. పొత్తు వద్దనుకుంటే మా దారి మేం చూసుకుంటామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై సోము వీర్రాజు అంతే ఘాటుగా స్పందించడంతో ఇరు పార్టీల పొత్తుకు బీటలు వారినట్లే అంటున్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై గంటా
బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి, టిడిపి నేత గంటా శ్రీనివాస రావు స్పందించారు. చంద్రబాబు ఓపికతో ఉన్నారని చెప్పారు. అన్నీ ఆలోచించే బీజేపీపై చంద్రబాబు మాట్లాడారని చెప్పారు. ఆయన మాట్లాడిన మాటలను వంద శాతం పాజిటివ్గా తీసుకోవాలన్నారు. తాము సీఎం చెప్పినట్లు నడుచుకుంటామని చెప్పారు.
ఇద్దరు కలిసి పని చేసినప్పుడు ఆరోపణలు వద్దు
ఇద్దరు కలిసి పని చేసినప్పుడు ఆరోపణలు వద్దని బీజేపీకి మంత్రి నారాయణ హితవు పలికారు.కేంద్ర బీజేపీ నేతలకు తెలియకుండా రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చాలా ఓపికతో ఉన్నారని ఆయన అన్నారు.