చిరంజీవి ఎంట్రీ ఖాయమే: 2024లో బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వం: సోము వీర్రాజు
అమరావతి: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీమంత్రి మెగాస్టార్ చిరంజీవి.. బీజేపీ-జనసేన కూటమికి అండగా ఉంటారంటూ కొద్దిరోజులుగా వస్తోన్న వార్తలపై మరోసారి స్పష్టత ఏర్పడింది. తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు రాజకీయంగా సహకారం అందించడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారంటూ కొద్దిరోజుల కిందటే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మరో ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో చిరంజీవి తమ కూటమి వెంటే ఉంటారని తేల్చి చెప్పారు.
డీజీపీ సవాంగ్పై క్రిమినల్ లా ప్రయోగం: పరువునష్టం దావాకూ వెనుకాడం: సోము వీర్రాజు వార్నింగ్
2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ-జనసేన కూటమికి చిరంజీవి మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు. ఆయన అండదండలతో రాష్ట్రంలో తమ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. చిరంజీవి మద్దతుతో 2024 ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో తమ కూటమికి మరిన్ని రాజకీయ పక్షాలు, సంఘాల నుంచి మద్దతు లభిస్తుందని, అవి ఏమిటనేవి ఇప్పుడే వివరించలేమని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికల అనంతరం ఏపీలో బీజేపీ, జనసేన బలపడుతాని ఆయన అన్నారు. దీనికి అనుగుణంగా తాము వ్యూహాలను రూపొందించుకుంటున్నామని, ఎన్నికల్లో పోటీ చేయడానికి యువతకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. తాము అధికారంలోకి రావాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారనే విషయం పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమౌతుందని సోమువీర్రాజు చెప్పారు. పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడాన్ని తాము సమర్థించట్లేదని స్పష్టం చేశారు. బలవంతపు ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ కుట్ర పన్నుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలను నిర్వహించితేనే.. ప్రజాభిప్రాయం ఏమిటో తెలుస్తుందని అన్నారు.
Recommended Video
ఆన్లైన్ ద్వారా నామినేషన్లను దాఖలు చేయడానికి అవకాశం కల్పించాలనే విషయాన్ని తాము ప్రతిపాదించామని, దీన్ని ఓ ఉద్యమంలా తీసుకెళ్తామని అన్నారు. గత ఏడాది రద్దయిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు అనేక చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారని, నామినేషన్ పత్రాలను చించేశారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికే ఆన్లైన్ ద్వారా నామినేషన్లను దాఖలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని సోము చెప్పారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా అధికార పార్టీకి బుద్ధి చెబుతామని అన్నారు.