మీరే నిధులు ఎక్కువన్నారు!: బాబుకు సోము వీర్రాజు షాక్, నిలదీసిన నేతకు బీజేపీ షాక్
విజయవాడ: టీడీపీపై ఏపీ బీజేపీ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు మంగళవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆయన చెప్పారు. 85 శాతం నిధులు మంజూరు చేసిందన్నారు.
టీడీపీపై బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు: 'మాణిక్యాలరావు వెనుక జగన్!'
Recommended Video
కేవలం పదిహేను శాతం నిధులు మాత్రమే ఇంకా ఇవ్వాల్సి ఉందని తేల్చి చెప్పారు. రాజమండ్రిలో జరిగిన బీజేపీ మహిళా మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల్లో ఎనభై శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్నవే అని చెప్పారు.
చంద్రబాబు అప్పుడేం చెప్పారంటే
పోలవరం ప్రాజెక్టు ఖర్చును మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని సోము వీర్రాజు చెప్పారు. ఈ విషయాన్ని పార్లమెంటులో కూడా స్పష్టం చేశామని గుర్తు చేశారు. కేంద్రం సహకరిస్తోందంటూ గతంలో చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించారన్నారు. ఈ మేరకు కొన్ని క్లిప్పింగ్స్ను ఆయన చూపించారు.
ఇంకా నిధులు అడగలేమని చంద్రబాబే చెప్పారు
నవ్యాంధ్రను కేంద్రం ఆదుకుంటోందని సోము వీర్రాజు చెప్పారు. కేంద్రాన్ని ఇంతకు మించి అడగలేమని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే గతంలో చెప్పారన్నారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు గగ్గోలు పెడుతున్నట్లుగా కేంద్రం నిధులు కేటాయించలేదన్నది పూర్తిగా అవాస్తవమన్నారు.
హరిబాబుతో వాగ్వాదానికి దిగిన నేతకు బీజేపీ షాక్
ఏపీ బీజేపీలో అంతర్గత విభేదాలు బయటకు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం బీజేపీ పదాదికారుల సమావేశంలో బీజేపీ ఏపీ అధ్యక్షులు హరిబాబును నిలదీసిన లక్ష్మీపతి రాజుకు షాకిచ్చారు. ఆయన కృష్ణా జిల్లాకు చెందిన నాయకులు. ఆయనను ఇక నుంచి చర్చా వేదికలకు పిలువవద్దని మీడియాకు ఏపీ బీజేపీ జనరల్ సెక్రటరీ సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.
పార్టీ వాయిస్ వినిపిస్తే గొంతు నొక్కుతారా
ఆదివారం నాడు జరిగిన పదాదికారుల సమావేశంలో లక్ష్మీపతిరాజు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీకి ఎప్పుడో గట్టిగా సమాధానం చెప్పాల్సి ఉందని, కానీ కొందరు నేతలు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నారని, దీంతో మనం ఎదగడం లేదని హరిబాబుతో వాగ్వాదానికి దిగారు. అయితే, పార్టీ గొంతు వినిపించే వారి గొంతు నొక్కడం సరికాదని కొందరు అంటున్నారు.