కాంగ్రెస్తో కలిశావ్, మేం చెప్పామా, పవన్ కళ్యాణ్ వల్లే: బాబుపై వీర్రాజు సంచలనం
Recommended Video
అమరావతి: బీజేపీ నేత, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు మంగళవారం టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో కాంగ్రెస్ పార్టీతో జత కలిశారని తీవ్ర ఆరోపణలు చేశారు. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి, ఇతరులను ప్రధానమంత్రిని చేశారని చెప్పారు.
అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసినట్లే కదా అని అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యలతో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ బాధపడినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన మీ స్థాయి ఏమిటి అని మాట్లాడటం సరికాదని విమర్శించారు.
మా సత్తా అందరికీ తెలుసు
వాజపేయి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వరకు తమ స్థాయి, తమ బలం ఏమిటో అందరికీ తెలుసునని సోము వీర్రాజు అన్నారు. పొత్తులో భాగంగా చంద్రబాబును వాజపేయి హయాంలో బాగా ఆదరించామని చెప్పారు. 2009లో చంద్రబాబు విడిగా పోటీ చేసి నెగ్గలేకపోయారని చెప్పారు. అవసరమైతే మా సత్తా చూపిస్తామని అభిప్రాయపడ్డారు.
మా మూలంగా మీరు గెలిచారని ఎప్పుడూ చెప్పలేదు
నేను వాస్తవాలు చెప్పానని, మా పార్టీ బలోపేతం కోసం మాట్లాడుతుంటే, మీరు మమ్మల్ని అనడం ఏమిటని టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్పై సోము వీర్రాజు మండిపడ్డారు. మా మూలంగా తెలుగుదేశం గెలిచిందని మేం ఎప్పుడూ చెప్పలేదన్నారు.
మేం ఐస్ క్రీం పుల్లలం కాదు
పదేపదే కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 3సీట్లే గెలిచారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, కానీ తాము అన్ని స్థానాల్లో పోటీ చేయలేక కాదన్నారు. తాము మంచి మిత్రపక్షంగా ఉన్నామని చెప్పారు. మేం ఏమీ ఐస్ క్రీం పుల్లలం కాదని చెప్పారు. 2014లో మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు తిరిగితే రెండు శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయని, కానీ మా వల్ల గెలిచామని మేం ఎప్పుడైనా చెప్పామా అన్నారు.
మోడీ, షాలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుట్ర
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని సోము వీర్రాజు ఆరోపించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. నోట్ల రద్దు, జీఎస్టీపై లేనిపోని ప్రచారం చేశారన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో దేశం ఎంతో నష్టపోయిందన్నారు. తన దృష్టిలో కాంగ్రెస్ కుదేలయిందని, కాంగ్రెస్ పార్టీ ఆయుధాలు ఏమి ఉన్నాయని ప్రశ్నించారు.
గుజరాత్ ఆషామాషీ కాదు
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు, ఫలితాలు ఆషామాషీవి కావని సోము వీర్రాజు చెప్పారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ తన పార్టీని ఎందుకు గెలిపించుకోలేకపోయిందన్నారు. కులాలు, మతాలకు వ్యతిరేకంగా అభివృద్ధికి ఓటు వేశారన్నారు. గుజరాత్ ప్రజలు నిజమైన తీర్పు ఇచ్చారన్నారు.